Begin typing your search above and press return to search.

అడ్డంగా బుక్కైన 'మైత్రీ'.. ఇప్ప‌టికైనా వెన‌క్కి త‌గ్గుతారా?

By:  Tupaki Desk   |   26 Oct 2022 5:41 PM GMT
అడ్డంగా బుక్కైన మైత్రీ.. ఇప్ప‌టికైనా వెన‌క్కి త‌గ్గుతారా?
X
పలు విజయవంతమైన చిత్రాలతో తక్కువ సమయంలో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్.. వచ్చే ఏడాది సంక్రాంతికి రెండు పెద్ద చిత్రాలతో ప్రేక్షకులను పలకరించబోతోన్న సంగ‌తి తెలిసిందే. అందులో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 'వీర సింహారెడ్డి' ఒకటి కాగా.. మరొకటి మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న 'వాల్తేరు వీరయ్య'.

'వీర సింహారెడ్డి' చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుంటే.. కన్నడ నటుడు దునియా విజయ్ విలన్ గా కనిపించబోతున్నాడు. అలాగే విలక్షణ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఇందులో బాలయ్య సోదరిగా నటిస్తోంది. ఇటీవలె టైటిల్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేసిన మేకర్స్.. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుద‌ల కాబోతోంద‌ని స్పష్టం చేశారు.

అలాగే 'వాల్తేరు వీరయ్య' విషయానికి వస్తే.. యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న‌ ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంటే మాస్ మహారాజ్ రవితేజ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా సైతం సంక్రాంతి బ‌రిలోనే దిగిబోతోంది. ఇప్పటికే దీనిపై అధికారిక ప్రకటన సైతం వచ్చింది.

అయితే ఈ రెండు చిత్రాలను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ వారికి ఇప్పుడు కొత్త తలనొప్పి మొదలైందట. నిజానికి మొదట ఈ రెండు చిత్రాల్లో ఒకదానిని సంక్రాంతికి విడుదల చేయాలని మైత్రీ వారు భావించారు. కానీ అటు బాలయ్య, ఇటు చిరు ఎవరూ తగ్గకపోవడంతో చేసేదేమీ లేక రెండు చిత్రాలను సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

కానీ ఒకే బ్యానర్ లో రెండు సినిమాలు ఒకేసారి విడుదల అయితే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. టాక్ ఏ మాత్రం తేడాగా వ‌చ్చినా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా నష్టపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలోనే రెండు సినిమాలుకు అడ్వాన్సులు ఇచ్చే పరిస్థితుల్లో తాము లేమంటూ బ‌య్య‌ర్లు మైత్రీ వారికి చెబుతున్నార‌ని టాక్ వినిపిస్తోంది.

అంతేకాదు, ఏదో ఒక సినిమాను సమ్మర్ కి పోస్ట్ పోన్ చేసుకోమని, అలాగైతేనే అడ్వాన్సులు ఇస్తామని తేల్చేస్తున్నారట. దీంతో మైత్రీ వారు మళ్లీ ఆలోచ‌న‌లో పడ్డారట. ఏ సినిమాను వెనక్కి తొయ్యాలో అర్థం కాక సతమతం అవుతున్నారని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలోనే రెండు సినిమాల‌ రిలీజ్ అనౌన్స్మెంట్ ఇచ్చి మైత్రీ వారు అడ్డంగా బుక్ అయ్యారని నెటిజ‌న్లు అభిప్రాయపడుతున్నారు. మ‌రి మైత్రీ వారు ఇప్ప‌టికైనా వెన‌క్కి త‌గ్గుతారా? లేదా..? అన్న‌ది చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.