Begin typing your search above and press return to search.

చైతూతో విడాకుల తర్వాత మళ్లీ అదే ఇంటిని భారీ ధరకు కొనుగోలు చేసిన సామ్?

By:  Tupaki Desk   |   29 July 2022 3:30 AM GMT
చైతూతో విడాకుల తర్వాత మళ్లీ అదే ఇంటిని భారీ ధరకు కొనుగోలు చేసిన సామ్?
X
ప్రేమించి పెళ్లి చేసుకున్న అక్కినేని నాగచైతన్య - సమంత జంట విడిపోతున్నట్లు ప్రకటించి తొమ్మిది నెలలు గడుస్తున్నా.. ఇప్పటికీ వీరి గురించి సోషల్ మీడియాలో ఏదొక న్యూస్ చక్కర్లు కొడుతూనే ఉంది. నిజానికి డివోర్స్ తర్వాత సామ్ పైనే సోషల్ మీడియాలో ఎక్కువగా నెగిటివిటీ స్ప్రెడ్ అయింది.

భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడానికి సమంతనే కారణమనే విధంగా ప్రచారం జరిగింది. అలానే విడాకుల తర్వాత నాగ చైతన్య నుండి సమంత రూ. 200 కోట్ల భరణం డిమాండ్ చేసినట్లు కూడా రూమర్స్ వచ్చాయి. ఇటీవల 'కాఫీ విత్ కరణ్' టాక్ షోలో దీనిపై సామ్ క్లారిటీ ఇచ్చింది. అవన్నీ ఒట్టి పుకార్లే అని కొట్టిపారేసింది.

ఇకపోతే విడాకుల ప్రకటన తర్వాత చై - సామ్ ఇద్దరూ వేర్వేరుగా జీవిస్తున్నారు. విడిపోక ముందు ఉన్న ఇంట్లో సమంత ఉంటే.. చైతూ మాత్రం కొన్నాళ్ళు హోటల్ లో ఉండి ఇప్పుడు కొత్త ఇల్లు ఏర్పాటు చేసుకుంటున్నట్లు టాక్. అయితే వీరిద్దరూ కలిసి జీవించిన ఇంటిని విడాకుల తర్వాత చై తన మాజీ భార్యకే ఇచ్చేసాడని వార్తలు వినిపించాయి. ఇది సీనియర్ నటుడు మురళీ మోహన్ కు చెందిన జయభేరి అపార్ట్మెంట్స్ లో ఉంటుందనే సంగతి తెలిసిందే.

అయితే ప్రస్తుతం సమంత నివసిస్తున్న గచ్చిబౌలిలోని ఇంటి గురించి మురళీ మోహన్ ఓ ఆసక్తికరమైన విషయం వెల్లడించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. సెలబ్రిటీ కపుల్ ఆ ఫ్లాట్ ని వేరే వాళ్ళకి విక్రయించారని.. కానీ విడాకుల తర్వాత భారీ మొత్తం చెల్లించి ఆ ఇంటిని సొంతం చేసుకున్నట్లు తెలిపారు.

మురళీ మోహన్ మాట్లాడుతూ.. మా ప్లాట్స్ లో ఉంటున్నప్పుడే వాళ్లిద్దరూ కలిపి ఒక ఇండిపెండెంట్ హౌస్ కొనుకున్నారు. అది రీ మోడలింగ్ చేసుకుంటున్నప్పుడు ప్లాట్ అమ్మేశారు. అయితే కొత్తగా కొన్న ఇల్లు పూర్తయ్యే వరకు ఇక్కడే ఉంటామని అడిగితే ఓనర్స్ ఒప్పుకున్నారు.

ఇద్దరూ విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత సమంత మరో ఇల్లు కొనడానికి ఎక్కడెక్కడో బాగా తిరిగింది. కానీ ఆవిడకు ఎక్కడా నచ్చలేదు. గతంలో ఉన్న ప్లాట్ అయితేనే సెక్యూరిటీ పరంగా, సేఫ్టీ పరంగా బాగుంటుందని నాకు కావాలని వచ్చి అడిగింది.

మీరు వేరే వాళ్లకు అమ్మేశారు కదా.. ఇప్పుడెలా అన్నాను. వాళ్లతో మాట్లాడి ఒప్పించి.. ఫ్లాట్ కొన్నవాళ్లకు కొంత ప్రాఫిట్ కూడా కలిపిచ్చి సమంత ఆ ప్లాట్ ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం సమంత ఆ ఇంట్లోనే ఉంటోంది. ఆమె వాళ్ళ అమ్మ మాత్రమే ఉంటారు అని చెప్పుకొచ్చారు.

అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే సమంత ని పెళ్లి చేసుకోకముందే ఆ ఇంటిని నాగ చైతన్య ఇష్టపడి కొనుక్కున్నారు. మురళీమోహన్ ముచ్చటపడి తన అపార్ట్మెంట్ లో కట్టుకున్న మూడు ప్లాట్స్ లో చై ఒకటి ఇవ్వమని కోరాడని ఆయనే ఓ ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు.

అయితే అవి తమ ఫ్యామిలీ కోసం కట్టినవని అమ్మడం కుదరదని మురళీ మోహన్ చెప్పడంతో.. చైతూ తన తండ్రి నాగార్జునతో మాట్లాడించి ఆ ఇంటిని సొంతం చేసుకున్నాడు. పెళ్లి తర్వాత ఆ ఇంటిలోనే సమంతతో కలిసి నాలుగేళ్లు జీవించాడు చై. కానీ దురదృష్టవశాత్తు ఆ ఇంటిలో ఉండగానే భార్యాభర్తలు విడాకులు తీసుకున్నారు.

చై సామ్ డివోర్స్ తీసుకోడానికి గత కారణాలు ఏంటనేది బయటకు తెలియనప్పటికీ.. ఇద్దరి మధ్య పెద్ద వివాదమే జరిగిందని ఇటీవల కరణ్ టాక్ షోలో సమంత కామెంట్స్ ని బట్టి అర్థమవుతుంది. మీ భర్త నుంచి విడిపోయిప్పుడు మీ మైండ్ స్టేటస్ ఏంటి? అని కరణ్ ప్రశ్నించగా.. 'భర్త కాదు.. మాజీ భర్త' అని సమంత ఘాటుగా సమాధానమిచ్చింది.

ఇంకా హార్డ్ ఫీలింగ్స్ ఉన్నాయా? అని అడగ్గా.. మీరు మా ఇద్దరినీ ఒకే గదిలో ఉంచితే పదునైన వస్తువులు దాచాల్సి ఉంటుంది.. ప్రస్తుతం అలా ఉంది అని సమంత వ్యాఖ్యానించింది. ఇది నాగ చైతన్య పై ఆమె ఎంతో కోపంతో రగిలిపోతున్న విషయాన్ని సూచిస్తుంది.