Begin typing your search above and press return to search.

ఏఎన్నార్ ను ఎప్పుడు చూస్తానా అనుకుడేవాడిని: మురళీమోహన్

By:  Tupaki Desk   |   25 Jun 2021 6:00 AM IST
ఏఎన్నార్ ను ఎప్పుడు చూస్తానా అనుకుడేవాడిని: మురళీమోహన్
X
తెలుగు తెరపై కథానాయకుడిగా మురళీ మోహన్ తన ప్ర్రత్యేకతను చాటుకున్నారు. నటనపరంగా ఒకసారి కెమెరా ముందుకు వచ్చిన ఆయనకి, ఇక వెనుదిరిగి చూసుకోవలసిన అవసరం రాలేదు. అందుకు కారణం ఆయన అంకితభావం అనే చెప్పాలి. ఒక దశ తరువాత ఆయన కేరక్టర్ ఆర్టిస్టుగా బిజీ అయ్యారు. ఒక వైపున తన రియల్ ఎస్టేట్ వ్యవహారాలు చూసుకుంటూనే, మరో వైపున అనేక సినిమాల్లో నటించారు. నటుడిగా కొనసాగుతూనే 'జయభేరి ఆర్ట్స్' సంస్థను స్థాపించి, వరుసగా సినిమాలను నిర్మించారు.

అలాంటి మురళీమోహన్ తాజా ఇంటర్యూలో మాట్లాడుతూ .. " మాది పశ్చిమ గోదావరి జిల్లాలోని 'చాటపర్రు'. కాలేజ్ విద్య అంతా కూడా 'ఏలూరు'లో జరిగింది. అప్పట్లో కృష్ణ .. క్రాంతికుమార్ నా క్లాస్ మేట్స్. కాలేజ్ చదువు పూర్తయిన తరువాత బిజినెస్ వైపు వచ్చేశాను. విజయవాడలో బిజినెస్ చేసుకుంటూ ఉండగానే, నా దృష్టి నటనవైపుకు మళ్లింది. అందుకు మా శ్రీమతి కూడా అంగీకరించింది. అయితే ఎలాంటి వ్యసనాల జోలికి వెళ్లకూడదంటూ ముందుగానే నా నుంచి మాట తీసుకుంది. నేను ఆ మాటకి కట్టుబడే ఉన్నాను.

నేను సినిమా ఫీల్డ్ కి కొంచెం లేటుగానే వచ్చాను. ఆ కారణంగా సాధ్యమైనన్ని ఎక్కువ సినిమాలు చేసేయాలని నిర్ణయించుకున్నాను. అందువల్లనే రెండు షిఫ్టులలో పనిచేశాను. నేను అనుకున్న దానికంటే ఎక్కువగానే సినిమా ఫీల్డ్ లో సక్సెస్ అయ్యాను. సొంత బ్యానర్ పై 25 సినిమాల వరకూ నిర్మించాను. వాటిలో ఒక ఐదారు పోయాయంతే .. మిగతావన్నీ సక్సెస్ అయ్యాయి. సినిమాల్లోకి రాక మునుపు ఏఎన్నార్ ను చూస్తానో లేదో .. సావిత్రిగారిని చూస్తానో లేదో అనుకున్నాను. కానీ వారితో కలిసి నటించే అవకాశం వచ్చింది. అంతకన్నా కావలసినదేవుంటుంది?" అని చెప్పుకొచ్చారు.