Begin typing your search above and press return to search.

స‌ర్ ప్రైజ్ ఇస్తా.. షాక‌వ్వ‌కండీ!

By:  Tupaki Desk   |   1 Jan 2020 8:47 AM GMT
స‌ర్ ప్రైజ్ ఇస్తా.. షాక‌వ్వ‌కండీ!
X
యం.ఎస్. రాజు.. పరిచయం అవసరం లేని పేరు ఇది. టాలీవుడ్ లో వేసవి విజయాలకు కేరాఫ్ అడ్రస్ ఆయన. ప్రతి యేటా సమ్మర్ ట్రీట్ ని రెడీ చేసేవారు. విక్టరీ వెంకటేష్ `శత్రువు` సినిమాతో రాజుగారి జైత్రయాత్ర మొదలైంది. కెరీర్ ఆరంభమే పోలీస్ లాకప్- దేవి వంటి బ్లాక్ బస్టర్ విజయాలని చూసిన ఆయన స్పీడ్ కు `దేవీ పుత్రుడు` బ్రేక్ వేసింది. ఆ సమయంలో సిద్ధార్థ్ తో చేసిన `నువ్వొస్తానంటే నేనొద్దంటానా`తో మళ్లీ విజయాల పరంపర మొదలైంది. 2001 నుంచి 2005 వరకు ఆయన వరుస హిట్ లను సొంతం చేసుకుని సమ్మర్ హిట్ చిత్రాల రాజుగా పేరు తెచ్చుకున్నారు.

ప్రభాస్ తో చేసిన `పౌర్ణమి` బిగ్ డిసప్పాయింట్ మెంట్. ఆ సినిమా పరాజయంతోనే యం.ఎస్. రాజు డౌన్ ఫాల్ మళ్లీ మొదలైంది. ఆయనే డైరెక్టర్ గా మారినా పనవ్వలేదు. దర్శకుడిగా తెరకెక్కించిన `వాన` ఆయనను నష్టాల ఊబిలోకి నెట్టేసింది. ఫలితం హిట్ చిత్రాల రాజు కాస్తా కోలుకోలేని ఫ్లాప్ ల రాజుగా మరుగున పడిపోవాల్సి వచ్చింది. అటుపై కొడుకుని అయినా హీరోగా నిలబెట్టాలన్న ఆయన తపన తప్పుదారి పట్టడం సమస్యాత్మకమే అయ్యింది. వారసుడు సుమంత్ అశ్విన్ నటించిన సినిమాలు వరుస ఫ్లాపులవ్వడం నిరాశపరిచింది. నిర్మాతగా మూడు ఫిల్మ్ ఫేర్ అవార్డులు.. రెండు నంది పురస్కారాల్ని సొంతం చేసుకున్న ఆయన మళ్లీ కొంత విరామం తరువాత బౌన్స్ బ్యాక్ కాబోతున్నారని తెలుస్తోంది.

తాజాగా జనవరి 1న ఆయన సోషల్ మీడియా ట్విట్టర్ లో పెట్టిన పోస్ట్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ``రేపు అంతా ఆశ్చర్యపోయే ప్రకటన చేయబోతున్నాను.. షాకవ్వకండి`` అని ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. గత కొన్నేళ్లుగా యం.ఎస్. రాజు సినిమాలకు దూరంగా వుంటూ వస్తున్నారు. ఇక ఆయన నుంచి సినిమాలు రావడం కష్టమే అని అంతా ప్రచారం జరిగింది. ఆ ప్రచారానికి కౌంటర్ గా మళ్లీ షాకిచ్చే ప్రకటన తో యం.ఎస్. రాజు ఐయామ్ బ్యాక్ అని అనడం నిజంగా పరిశ్రమ వర్గాలకు షాకింగ్ న్యూసే.