Begin typing your search above and press return to search.

నితిన్ సినిమాలో ఆ రోల్ కోసం ఎవరిని సెలెక్ట్ చేయబోతున్నారు...?

By:  Tupaki Desk   |   28 Jun 2020 4:30 AM GMT
నితిన్ సినిమాలో ఆ రోల్ కోసం ఎవరిని సెలెక్ట్ చేయబోతున్నారు...?
X
'భీష్మ' సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు హీరో నితిన్. ఈ సినిమా ఇచ్చిన జోష్ తో వరుసగా సినిమాలు లైన్లో పెడుతూ దూకుడు చూపిస్తున్నాడు నితిన్. ఈ క్రమంలో బాలీవుడ్ లో సంచలన విజయం సాధించిన ‘అంధాదున్' మూవీని తెలుగులో రిమేక్ చేయబోతున్న విషయం తెలిసిందే. హిందీ 'అంధాదున్' సినిమాకి శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించగా ఆయుష్మాన్ ఖురానా - రాధికా ఆప్టే హీరో హీరోయిన్లుగా నటించారు. వీరితో పాటు సీనియర్ హీరోయిన్ టబు ఈ సినిమాలో కీలక పాత్రలో నటించింది. కాగా నితిన్ నటించినబోయే ఈ సినిమా రీమేక్ కి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించనున్నారు. శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ పై నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి మరియు ఠాగూర్ మధు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుపుతున్న చిత్ర యూనిట్ మిగతా లీడ్ క్యారెక్టర్స్ ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో సినిమాలో కీ రోల్ అయిన టబు పాత్రని తెలుగులో ఎవరు పోషిస్తారనేది ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో తెలుగులో కూడా టబు నే నటింపజేయాలని చిత్ర యూనిట్ భావించారట. అయితే టబు ఇతర సినిమాలతో బిజీగా ఉండటం వలన డేట్స్ కేటాయించలేనని చెప్పిందట. ఇక ఆ తర్వాత రమ్యకృష్ణ, అనసూయల పేర్లు వినిపించాయి. వీరితో పాటు ఈ పాత్ర కోసం బాలీవుడ్ పొడుగుకాళ్ల సుందరి శిల్పాశెట్టిని సంప్రదిస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే వీరిలో ఎవరి డేట్స్ ఖాళీగా ఉన్నాయి.. ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలని అనే విషయం మీద చిత్ర యూనిట్ మల్లగుల్లాలు పడుతోందట. హిందీ 'అంధాదున్' విజయంలో కీ రోల్ ప్లే చేసిన టబు క్యారెక్టర్ కి ఎవరైతే న్యాయం చేయగలరని ఆలోచిస్తున్నారట. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా 'గ్యాంగ్ లీడర్' ఫేమ్ ప్రియాంక మోహన్ ని తీసుకున్నారట. మరి నితిన్ సినిమాపై వస్తున్న వార్తలు నిజమో కాదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

కాగా నితిన్ ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'రంగ్ దే' సినిమాలో నటిస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్‌ పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్నారు. నితిన్ - కీర్తి సురేష్‌ లు తొలిసారి కలిసి నటిస్తుండటంతో కెమిస్ట్రీ వర్కౌట్ అయినట్టే కనిపిస్తోంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తుండగా.. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించడం విశేషం. ఈ సినిమాతో పాటు కృష్ణ చైతన్య దర్శకత్వంలో 'పవర్ పేట' అనే సినిమాలో కూడా నితిన్ నటించనున్నాడు.