Begin typing your search above and press return to search.

హవ్వ.. మితిమీరిన సెన్సేషలిజం

By:  Tupaki Desk   |   27 Feb 2018 5:18 AM GMT
హవ్వ.. మితిమీరిన సెన్సేషలిజం
X

అతిలోక సుందరి శ్రీదేవి హఠాన్మరణం మొత్తం దేశాన్ని కలచివేసింది. దుబాయ్ లో పెళ్లి వేడుకకు వెళ్లిన ఆమె అటు నుంచి అటే సెలవంటూ ఈ లోకాన్ని వదిలివెళ్లిపోవడం అందరినీ ఆవేదనకు గురిచేసింది. ముందు శ్రీదేవి గుండెపోటుతో కన్నుమూసిందనే న్యూస్ వచ్చినా తాజాగా దుబాయ్ పోలీసులు ఆమె ప్రమాదవశాత్తు బాత్ టబ్ లో మునిగి చనిపోయిందని తేల్చారు.

ఈ విషయం బయటపడినప్పటి నుంచి టీవీ ఛానళ్లు రకరకాల ఊహాగానాలు మొదలుపెట్టేశాయి. దుబాయ్ పోలీసులు ఇంకా ఆమె మృతిపై ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తుండగానే ఇక్కడ టీవీ ఛానళ్లు రకరకాల వ్యాఖ్యానాలతో కథనాలు ప్రసారం చేశాయి. ఆమె ఎలా చనిపోయింది.. అందుకు కారణమైన పరిస్థితులేంటి అంటూ నోటికొచ్చిందల్లా మాట్లాడేసి సెన్సేషలిజం కోసం తెగ ఆరాటపడిపోయాయి. కొన్ని ఛానళ్లయితే వాళ్ల ఆస్థాన విద్వాంసుల్లాంటి వాళ్లందరినీ పిలిపించి శ్రీదేవి మృతిపై డిస్కషన్లు కూ పెట్టేశాయి. టీవీ ఛానళ్ల ఈ అతి బాలీవుడ్ సెలబ్రిటీలకు చాలా కోపం తెప్పించింది. రామ్ గోపాల్ వర్మ.. ఫర్హాన్ అఖ్తర్ వంటివారైతే డైరెక్ట్ గానే తప్పుపట్టారు.

దేశమంతటా గుర్తింపు తెచ్చుకున్న ఓ గొప్ప నటి గురించి ప్రసారం చేసేటప్పుడు కాస్తంత సంయమనం పాటించాలన్న విషయాన్ని టీవీ ఛానళ్లు విస్మరించడంపై సోషల్ మీడియా నెగిటివ్ కామెంట్లు వెల్లువెత్తాయి. ఇన్వెస్టిగేషన్ లో తేలిన ఇన్ఫర్మేషన్ జనాలకు తెలియజేయడం మానేసి సొంతంగా స్టేట్ మెంట్లు ఇచ్చేయడం ఏమిటని నెటిజన్లు మండిపడిపోతున్నారు. ఈలెక్కన శ్రీదేవి అంత్యక్రియలు పూర్తయ్యేలోగా ఇంకెంత హడావుడి చేస్తాయో ఏంటో?