Begin typing your search above and press return to search.

ఫైనల్ షూట్ కోసం సెట్స్ లో అడుగుపెట్టిన మాస్ మహారాజా...!

By:  Tupaki Desk   |   9 Oct 2020 3:45 PM IST
ఫైనల్ షూట్ కోసం సెట్స్ లో అడుగుపెట్టిన మాస్ మహారాజా...!
X
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''క్రాక్''. సరస్వతి ఫిలిమ్‌ డివిజన్‌ బ్యానర్‌ పై ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. రవితేజతో 'డాన్‌ శీను' 'బలుపు' చిత్రాలను తెరకెక్కించిన గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ జరుపుకున్న 'క్రాక్' కరోనా మహమ్మారి కారణంగా నిలిచిపోయింది. దాదాపు ఏడు నెలల తర్వాత ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ ఇటీవలే హైదరాబాద్ లో తిరిగి ప్రారంభమైంది. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ రోజు రవితేజ కూడా సెట్స్ లో అడుగుపెట్టేసాడు. తాజాగా రవితేజకు సంబంధించిన ఓ పోస్టర్ రిలీజ్ చేస్తూ మేకర్స్ ఈ విషయాన్ని వెల్లడించారు.

కాగా, కొద్ది భాగం షూటింగ్ మాత్రమే మిగిలి ఉండడంతో ఈ షెడ్యూల్‌ లో దానిని పూర్తి చేసి.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెడతారని తెలుస్తోంది. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నాడు. రవితేజ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. వరలక్ష్మీ శరత్ కుమార్ - సముద్రఖని కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. 'మెర్షల్' 'బిగిల్' సినిమాటోగ్రాఫర్ జీకే విష్ణు 'క్రాక్' చిత్రం కోసం వర్క్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన 'క్రాక్' ఫస్ట్ లుక్ మరియు టీజర్ విశేష స్పందన తెచ్చుకున్న సంగతి తెలిసిందే. రవితేజ - గోపీచంద్‌ మలినేని కాంబోలో వస్తున్న ఈ హ్యాట్రిక్ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి.