Begin typing your search above and press return to search.

కరోనా వైరస్‌ తో మారుతి పాపులర్‌ అయ్యాడు

By:  Tupaki Desk   |   20 March 2020 9:45 AM IST
కరోనా వైరస్‌ తో మారుతి పాపులర్‌ అయ్యాడు
X
మారుతి దర్శకత్వం వహించిన చిత్రాల్లో `మహానుభావుడు` ఒకటి. అతిశుభ్రం ప్రధానంగా సాగే చిత్రమిది. అబ్సెసివ్‌ కంపల్సివ్‌ డిజార్డర్‌ తో బాధపడుతున్న వ్యక్తి చేష్టలను, ... అతనుపడే బాధలు.. అతని అతి శుభ్రం కారణంగా మిగిలిన వారు ఎలాంటి ఇబ్బంది పడతారు.. అందులోనుంచి పుట్టే హాస్యం ప్రధానంగా ఈ చిత్రాన్ని దర్శకుడు మారుతి రూపొందించారు. అతిశుభ్రంతో బాధపడే వ్యక్తిగా హీరో శర్వానంద్‌ అద్భుతంగా నటించి ఆకట్టుకున్నారు. ఆయనకు జోడిగా మెహరీన్‌ నటించింది. ఇప్పుడా సినిమా ప్రస్తావన ఎందుకనుకోవచ్చు. ఎందుకంటే మూడేండ్ల క్రితం మారుతి తన `మహానుభావుడు` సినిమాలో చెప్పిందే ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆచరిస్తుంది.

ప్రపచంలోని ప్రతి మనిషి చెప్పేది ఒక్కటే అన్నీ శుభ్రంగా కడుక్కోండి అని. దీంతో మన తెలుగు వారంతా ఇప్పుడు `మహానుభావుడు` సినిమానే గుర్తు చేసుకుంటున్నారు. అంతటితో ఆగలేదు ట్రోలింగ్‌ రాయళ్ళు, నెటిజనులు ఆ సినిమాలోని సన్నివేశాలను... నేటి కరోనాకి ముడిపెడుతూ కామెడీ వీడియోలుగా మారుస్తున్నారు. వాటినే ట్రోల్‌ చేస్తున్నారు. దీంతో అప్పుడు ఈ సినిమా కమర్షియల్‌ గా అంతగా పాపులర్‌ కాలేదు. కానీ కనీ వినీ ఎరుగని రీతిలో ఈ సినిమాకి ప్రస్తుతం పాపులారిటీ వచ్చేసింది. యూట్యూబ్‌ లో ఆ సినిమాకి సంబంధించిన వీడియోలకు విపరీతమైన వ్యూస్‌ వస్తుండటం విశేషం.

అయితే దీనిపై దర్శకుడు మారుతి మాట్లాడుతూ,``మా సినిమాని ప్రస్తావిస్తూ చాలా మంది నాకు ఫోన్లు..., మెసేజ్‌ లు పంపిస్తున్నారు. సినిమా తీసిన టైమ్‌ లో అతిశుభ్రం అంటే మరీ ఇంత దారుణంగా ఉంటారా? అని నవ్వుకున్నారు. ఒకానొక సమయంలో నాకూ సందేహం కలిగింది. హాస్యం కోసం చేస్తున్నాం కాబట్టి వర్కౌట్‌ అవుతుందనుకున్నా. సినిమా చేసే టైమ్‌ లో నేను కూడా అలానే ప్రవర్తించా. కానీ ఇప్పుడందరూ అదే పాటిస్తున్నారు. దీంతో ప్రపంచంలోని ప్రతి ఒక్కరు `మహానుభావుడు`గా మారి పోతున్నారు. భవిష్యత్‌ లో ఇలాంటి పరిస్థితి వస్తుందని తెలిస్తే ఆ సినిమాని ఇంకా బాగా తీసేవాడిని`` అని తెలిపారు. మారుతితోపాటు ఇప్పుడు శర్వానంద్‌ పేరు కూడా బాగా వినిపిస్తుంది. ఆయన నటించిన సన్నివేశాలను మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు.