Begin typing your search above and press return to search.

కొయిరాలా అభిమానుల‌కు ఇది పెద్ద షాకే

By:  Tupaki Desk   |   8 Feb 2017 1:30 PM GMT
కొయిరాలా అభిమానుల‌కు ఇది పెద్ద షాకే
X
90ల్లో కోట్లాది మంది కుర్రాళ్ల‌కు కునుకు లేకుండా చేసిన భామ మ‌నీషా కొయిరాలా. తెలుగులో ‘క్రిమిన‌ల్’.. త‌మిళంలో ‘భార‌తీయుడు’.. హిందీలో ‘దిల్ సే’ లాంటి చిత్రాల‌తో ఆమె వేసిన ముద్ర అలాంటిలాంటిది కాదు. ఇండియ‌న్ సినిమా చ‌రిత్ర‌లో అపురూప‌మైన అంద‌గ‌త్తెల్లో ఒక‌రిగా గుర్తింపు పొందింది మ‌నీషా. హీరోయిన్ గా అవ‌కాశాలు త‌గ్గిపోతున్న స‌మ‌యంలో పెళ్లి చేసుకుని నేపాల్ వెళ్లిపోయి.. ఆ పెళ్లి విఫ‌లం కావ‌డంతో తిరిగి బాలీవుడ్లోకి వ‌చ్చిన మ‌నీషాకు టాప్ డైరెక్ట‌ర్ రాజ్ కుమార్ హిరానీ ద‌ర్శ‌క‌త్వంలో ప‌ని చేసే గొప్ప అవ‌కాశం ల‌భించింది. కానీ ఆమె చేయ‌బోతున్న పాత్ర మాత్రం త‌న అభిమానుల‌కు ఎంత‌మాత్రం రుచించేది కాదు.

ప్ర‌స్తుతం మ‌నీషా కొయిరాలా వ‌య‌సు 46 ఏళ్లు. ఐతే ఆమె 34 ఏళ్ల వ‌య‌సున్న ర‌ణ‌బీర్ క‌పూర్ కు త‌ల్లిగా న‌టించ‌బోతోంద‌ట‌. రాజ్ కుమార్ హిరాని త‌న మిత్రుడు సంజ‌య్ ద‌త్ జీవిత క‌థ‌తో సినిమా తీస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో సంజూ త‌ల్లి న‌ర్గీస్ పాత్ర‌ను మ‌నీషా చేయ‌బోతోంద‌ట‌. మ‌నీషా లాంటి అంద‌గ‌త్తె అప్పుడే ర‌ణ‌బీర్ లాంటి హీరోకు త‌ల్లిగా న‌టించ‌డం ఆమె అభిమానుల‌కు మింగుడుప‌డ‌నిదే. ఐతే ఆల్రెడీ క్యారెక్ట‌ర్ రోల్స్ లోకి మారిపోయిన మ‌నీషా అవ‌కాశాలు అంతంత‌మాత్రంగా ఉండ‌టంతో.. అందులోనూ రాజ్ కుమార్ హిరానితో సినిమా అనేస‌రికి ఎలాంటి పాత్ర అయినా ఓకే అనుకున్న‌ట్లుంది. న‌ర్గీస్ క్యాన్స‌ర్ వ‌ల్ల చ‌నిపోగా.. మ‌నీషా కూడా నిజ జీవితంలో క్యాన్స‌ర్ బాధితురాలే కావ‌డం గ‌మ‌నార్హం. అందుకే మ‌నీషా అయితేనే ఈ పాత్ర‌కు న్యాయం చేస్తుంద‌ని హిరానీ భావించాడేమో హిరాని.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/