Begin typing your search above and press return to search.

టాలీవుడ్ కు విశాఖ ఉక్కు సెగ.. మంచు హీరోని అడ్డుకున్న ఉద్యమకారులు..!

By:  Tupaki Desk   |   13 March 2021 3:19 AM GMT
టాలీవుడ్ కు విశాఖ ఉక్కు సెగ.. మంచు హీరోని అడ్డుకున్న ఉద్యమకారులు..!
X
కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేయకుండా అడ్డుకోవడానికి కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీ మినహా మిగతా అన్ని రాజకీయ పార్టీలు ఈ పోరాటానికి మద్దతు ప్రకటించాయి. ఈ క్రమంలో టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి - నారా రోహిత్ - సుధీర్ బాబు - కోన వెంకట్ - కత్తి మహేష్ వంటి వారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. ఉద్యమకారులకు మద్దతు తెలిపారు. అయితే మిగతా సినీ ప్రముఖులెవరూ దీనిపై స్పందించకపోవడంపై ప్రజల్లో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో ఈరోజు హీరో మంచు విష్ణుకు విశాఖ ఉక్కు సెగ తగిలింది.

'మోసగాళ్లు' మూవీ ప్రమోషనల్ కార్యక్రమాలలో భాగంగా మంచు విష్ణు తన టీమ్ తో కలిసి ఈరోజు వైజాగ్ కు వెళ్లారు. ఈ సందర్భంగా ఉద్యమకారులు విష్ణును అడ్డుకుని.. ఈ ఉద్యమానికి సంఘీభావం ప్రకటించాలని వినతి పత్రం అందజేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంటును కాపాడుకునేందుకు చేస్తున్న పోరాటానికి టాలీవుడ్ మద్దతు ఇవ్వాలని... లేకపోతే సినిమా షూటింగులు సినిమా ఫంక్షన్స్ కోసం వైజాగ్ కు సినీ ప్రముఖులు ఎవరు వచ్చినా అడ్డుకుంటామని వారు స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో మంచు విష్ణు మాట్లాడుతూ ప్రైవేట్ కంపెనీలు ప్లాంటును లాభాల్లో నిర్వహిస్తామని చెపుతున్నప్పుడు.. అది ప్రభుత్వానికి ఎందుకు సాధ్యంకాదని ప్రశ్నించారు. ఉద్యమానికి మద్దతు ప్రకటించాలని సినీ ప్రముఖులకు ఉందని.. కానీ రాజకీయ కారణాలతో ఎవరూ ముందుకు రావడం లేదని ఈ సందర్భంగా విష్ణు అభిప్రాయపడ్డారు. ఇకపై సినీ పెద్దల నిర్ణయం ప్రకారం ముందుకెళ్తామని ఆయన చెప్పుకొచ్చారు.