Begin typing your search above and press return to search.

ఇకపై 'మా' ఎన్నికలపై మీడియాకు ఎక్కబోము: మంచు విష్ణు

By:  Tupaki Desk   |   16 Oct 2021 11:33 AM GMT
ఇకపై మా ఎన్నికలపై మీడియాకు ఎక్కబోము: మంచు విష్ణు
X
ఇటీవల జరిగిన ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ప్యానెల్ పై మంచు విష్ణు విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ‘మా’ నూతన అధ్యక్షుడిగా విష్ణు ఈరోజు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో ఏర్పాట్లు చేసిన ఈ కార్యక్రమంలో కొత్తగా ఎన్నికైన 'మా' కార్యవర్గం అంతా పదవీ బాధ్యతలు స్వీకరించారు.

ప్రమాణ స్వీకారం అనంతరం మంచు విష్ణు మాట్లాడుతూ.. 'మా' అభివృద్ధికి తాను అన్నివిధాలా కష్టపడతానని.. తన మేనిఫెస్టోలో చర్చించిన ప్రతిదీ అమలు జరిగేలా కృషి చేస్తానని.. దీనికి అందరి సహకారం కావాలని అన్నారు. ఇకపై తాను కానీ.. తన కమిటీ సభ్యులు ఎవరూ కూడా మీడియా ముందుకు రారని విష్ణు ప్రకటించారు. ముగిసిన ఎన్నికల గురించి మాట్లాడనని.. తాము ఏం చేయబోతున్నామో చెప్పడానికి మాత్రమే మీడియా ముందుకు వస్తామని అన్నారు.

'మా' అధ్యక్షుడుగా ఏమి చేయగలమో మోహన్ బాబు కొడుకుగా నేను నిరూపిస్తాను. మీ అందరి సహకారం నాకు కావాలి. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేశారు. ఎంతో మంది ఫోన్ చేసి విషెస్ అందించారు. మనమంతా ఒక ఫ్యామిలీ అని భరోసా ఇచ్చిన వారందరికి థ్యాంక్స్. గేమ్ ఆడినప్పుడు గెలుపు ఒకరి వైపే ఉంటుంది. ఎన్నికల్లో మేము గెలిచాం. ప్రత్యర్థి ప్యానెల్ వాళ్లు దాన్ని గౌరవించాలి. మా అసోసియేషన్ అభివృద్ధికి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే దానిపై వాళ్ల సలహాలు కూడా తీసుకుంటాను. ఈ విషయంలో వాళ్ళందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను అని మంచు విష్ణు అన్నారు.

''గెలిచిన తర్వాత ప్రత్యర్థి ప్యానెల్లోని సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. అది చాలా దురదృష్టకరం. అయినా సరే మేము ముందుకు వెళ్తాము. 'మా' ఇంకా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇంకా బ్రహ్మాండంగా అవుద్ది. దీనికి మీ అందరి ఆశీస్సులు కావాలి. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఎన్నికల్లో నేను గెలవాలని ఎంతో మంది గుడులకు వెళ్లి పూజలు చేశారు. నాకు మెజేసులు పెట్టారు.. అలానే ఏడిపించారు. అందరికీ థాంక్స్. 'మా' అసోసియేషన్ ఎన్నికల గురించి నేను కానీ నా టీమ్ కానీ ఇకపై మీడియాకు ఎక్కము. దయచేసి మీడియా వాళ్ళు కూడా దానిపై అడగకండి. ఇకపై జరగబోయే పనుల గురించే మాట్లాడతాను తప్ప.. జరిగిపోయిన వాటి గురించి మాట్లాడను. మేము చేసే ప్రతీ కొత్త పని గురించి మీకు క్లియర్ గా తెలియపరుస్తాం'' అని మంచు విష్ణు చెప్పుకొచ్చారు.

ఇకపోతే 'మా' కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి మంచు విష్ణు ప్యానల్ నుంచి గెలుపొందిన నటుడు రఘుబాబు సమయానికి హాజరు కాకపోవడంపై అనేక సందేహాలు వ్యక్తం అయ్యాయి. 'మా' కార్యదర్శిగా ఎన్నికైన రఘుబాబు ఈ ప్రమాణ స్వీకారానికి డుమ్మా కొట్టడంటూ పలు వార్తలు వచ్చాయి. అయితే ప్రమాణ స్వీకార మహోత్సవం ముగిసే సమయంలో రఘు బాబు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 'మా' సెక్రటరీగా ప్రమాణ స్వీకారం చేసి సర్టిఫికేట్ అందుకున్నారు.

కాగా, 'మా' నూతన కార్యవర్గ సమావేశానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డీఆర్సీ సభ్యులు మంచు మోహన్ బాబు - శివ కృష్ణ - మాజీ 'మా' అధ్యక్షుడు నరేష్ - నిర్మాతలు సి. కళ్యాణ్ - ఘట్టమనేని ఆది శేషగిరి రావు - ప్రసన్న కుమార్ లతో పాటుగా పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి వచ్చారు. దీనికి ప్రత్యర్థి ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి ఎవరూ హాజరు కాలేదు.