Begin typing your search above and press return to search.

మంచు ఫ్యామిలీ నుండి మరోటి... ఈసారి ఓటీటీ కోసం!

By:  Tupaki Desk   |   27 Jan 2022 8:05 AM GMT
మంచు ఫ్యామిలీ నుండి మరోటి... ఈసారి ఓటీటీ కోసం!
X
మంచు మోహన్ బాబు నటుడిగా ఎన్నో సినిమాల్లో నటించిన తర్వాత నిర్మాతగా శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్‌ బ్యానర్ ను ప్రారంభించి సినిమాలను నిర్మించాడు. ఇప్పటికి కూడా ఆ బ్యానర్‌ లో సినిమాలను ఆయన నిర్మిస్తూనే ఉన్నాడు. ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ఒకొక్కరు ఒక్కో నిర్మాణ సంస్థ ను ఏర్పాటు చేశారు. మంచు విష్ణు 24 ఫ్రేమ్స్ ను ఏర్పాటు చేసి వరుసగా తాను హీరోగా నటిస్తున్న సినిమాలను నిర్మిస్తూ వస్తున్నాడు. మంచు లక్ష్మి మరియు మనోజ్ లు కూడా సినిమాల నిర్మాణంలో ఉన్నారు. మంచు ఫ్యామిలీలో మూడు నాలుగు ప్రొడక్షన్‌ హౌస్ లు ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ కొత్త బ్యానర్ ను మంచు విష్ణు ఏర్పాటు చేయబోతున్నట్లుగా ప్రకటించాడు.

అవా అనే కొత్త నిర్మాణ సంస్థను మొదలు పెట్టబోతున్నట్లుగా మంచు విష్ణు ప్రకటించాడు. ఇప్పటికే ఒక బ్యానర్ ఉండగా మళ్లీ ఈ కొత్త బ్యానర్ ఎందుకు అంటూ కొందరు ముక్కున వేలేసుకుంటూ ఉన్నారు. మంచు విష్ణు షురూ చేసిన ఈ కొత్త బ్యానర్‌ లో కేవలం ఓటీటీ కంటెంట్ ను నిర్మించబోతున్నాడట. భవిష్యత్తు మొత్తం ఓటీటీ లదే కనుక పలు నిర్మాణ సంస్థలు ఓటీటీ కంటెంట్ ను నిర్మించేందుకు సిద్దం అవుతున్నాయి. అందుకే మంచు విష్ణు కూడా కొత్త ట్యాలెంట్ ను ప్రోత్సహిస్తూ ఓటీటీ సినిమాలు మరియు వెబ్‌ సిరీస్ ల వైపు అడుగులు వేస్తున్నారు. మంచు విష్ణు హీరోగా ఈమద్య కాలంలో చేసిన సినిమాలు ఏవీ కూడా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సొంతం చేసుకోలేక పోయాయి. దాంతో ఆయన కొత్త సినిమాల ఎంపిక విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

ఒక వైపు నిర్మాత సినిమాలను నిర్మిస్తూ మరో వైపు ఓటీటీ కంటెంట్ ను కూడా నిర్మించబోతున్నాడు. కొత్త వారికి అవకాశం ఇచ్చే ఉద్దేశ్యంతో మంచు విష్ణు ప్రారంభించిన ఈ కొత్త నిర్మాణ సంస్థ అతి త్వరలోనే మొదటి ప్రాజెక్ట్‌ ను పట్టాలెక్కించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఒక టీమ్ ను ఏర్పాటు చేసి కథలు రెడీ చేయిస్తున్నారు. కొత్త నటీ నటులు మరియు సాంకేతిక నిపుణులను ఆ టీమ్ అన్వేషించే పనిలో కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఓటీటీ లు వచ్చిన తర్వాత కొత్త వారికి ముఖ్యంగా ప్రతిభావంతులకు మంచి అవకాశాలు లభిస్తున్నాయి. ముందు ముందు మంచు వారు ఓటీటీ ద్వారా మరింత మందికి అవకాశాలు ఇస్తారని.. తద్వారా కొత్త ట్యాలెంట్ ఇండస్ట్రీకి పరిచయం అవ్వబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.