Begin typing your search above and press return to search.

'యాత్ర' వెనుక వైకాపా.. డైరెక్టర్‌ రియాక్షన్‌

By:  Tupaki Desk   |   30 Jan 2019 12:31 PM GMT
యాత్ర వెనుక వైకాపా.. డైరెక్టర్‌ రియాక్షన్‌
X
మహి వి రాఘవ దర్శకత్వంలో తెరకెక్కిన వైఎస్‌ ఆర్‌ సెమీ బయోపిక్‌ విడుదలకు రంగం సిద్దం అయ్యింది. ఫిబ్రవరి 8న ఈ చిత్రం విడుదలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రమోషన్‌ కార్యక్రమాలను జోరుగా చిత్ర యూనిట్‌ సభ్యులు నిర్వహిస్తున్నారు. త్వరలోనే జగన్‌ ముఖ్య అతిథిగా ప్రీ రిలీజ్‌ వేడుక జరుగబోతుంది. ఇక ఈ చిత్రం వెనుక జగన్‌ ఉన్నాడంటూ సినిమా ప్రారంభం అయినప్పటి నుండి కూడా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

తాజాగా దర్శకుడు మహి వి రాఘవ ఆ విషయమై క్లారిటీ ఇచ్చాడు. తనకు వైఎస్‌ ఆర్‌ పై సినిమా తీయమని ఎవరు చెప్పలేదు - అడగలేదు. నేను అమెరికా నుండి వచ్చిన కొన్నాళ్లకే వైఎస్‌ ఆర్‌ మరణించారు. ఆ తర్వాత నేను వైఎస్‌ గురించి చాలా విన్నాను. ఒక వ్యక్తి గురించి అంతగా మాట్లాడుకోవడం నన్ను కదిలించింది. అప్పుడు ఆయనపై సినిమా తీయాలనుకున్నాను. ఒక పార్టీకి మద్దతుగా అని కాకుండా ఇది ఒక ప్రజా నాయకుడి సినిమాగా తెరకెక్కించాను.

ప్రజల గుండెల్లో నిలిచి పోయిన వ్యక్తి జీవితాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనే ఉద్దేశ్యంతో ఈ చిత్రాన్ని తీశాను కాని, వైకాపాకు వచ్చే ఎన్నికల్లో మంచి చేయాలని, ఓట్లు పడేలా చేయాలనేది తన ఉద్దేశ్యం కాదని క్లారిటీ ఇచ్చాడు. ఇలాంటి బయోపిక్‌ ల వల్ల ఒకటి రెండు ఓట్లు కూడా రావని, ప్రజలు పూర్తి విచక్షణతో ఓట్లు వేస్తారని, సినిమాలు చూసి, పాటలు విని ఓట్లు వేసే పరిస్థితి లేదని, రాజకీయాలకు తాను తెరకెక్కించిన 'యాత్ర' సినిమాకు అస్సలు సంబంధం లేదని మహి ఫుల్‌ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.