Begin typing your search above and press return to search.

మ‌హేష్ - త్రివిక్ర‌మ్ మూవీకి క్లాప్ కొట్టేశారు

By:  Tupaki Desk   |   3 Feb 2022 6:24 AM GMT
మ‌హేష్ - త్రివిక్ర‌మ్ మూవీకి క్లాప్ కొట్టేశారు
X
మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ - సూప‌ర్ స్టార్ మ‌హేష్ చాలా ఏళ్ల విరామం త‌రువాత క‌లిసి ఓ భారీ ప్రాజెక్ట్ చేస్తున్న విష‌యం తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై ఎస్‌. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. దాదాపు ఏడాది క్రితం అంటే మే 1న ఈ చిత్రాన్ని అఫీషియ‌ల్ గా మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. అయితే మ‌హేష్ `స‌ర్కారు వారి పాట‌` సినిమా షూటింగ్ లో బిజీగా వుండ‌టం వ‌ల్ల ఈ ప్రాజెక్ట్ ఆల‌స్య‌మ‌వుతూ వ‌చ్చింది.

ఎట్ట‌కేల‌కు ఫిబ్ర‌వ‌రి 3 గురువారం ఉద‌యం 10 గంట‌ల‌కు లాంఛ‌నంగా ప్రారంభమైంది. SSMB28 వ‌ర్కింగ్ టైటిల్‌గా తెర‌కెక్క‌నున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా న‌టిస్తోంది. గురువారం జ‌రిగిన ప్రారంభోత్స‌వానికి హీరో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హాజ‌రు కాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. అయితే ఆయ‌న స్థానంలో ఈ కార్య‌క్ర‌మంలో న‌మ్రత పాల్గొన్నారు. న‌మ్ర‌త‌తో పాటు ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్‌, నిర్మాత‌లు ఎస్‌. రాధాకృష్ణ‌, సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ, హీరోయిన్ పూజా హెగ్డే, ఆర్ట్ డైరెక్ట‌ర్ ఏ.ఎస్‌. ప్ర‌కాష్ టెక్నిక‌ల్ టీమ్ హాజ‌ర‌య్యారు.

ఎట్ట‌కేల‌కు ఈ మూవీ లాంఛ‌నంగా ముహూర్తం జ‌రుపుకోవ‌డంతో గ‌త కొన్ని నెల‌లుగా వాస్తున్న వార్త‌లకు చెక్ ప‌డింది. గ‌త ఏడాది న‌వంబ‌ర్ లో ఈ మూవీ సెట్స్ పైకి వెళుతుంద‌ని వార్త‌లు వినిపించాయి. అయినా ఎలాంటి క‌ద‌లిక లేక‌పోవ‌డంతో అంతా ఈ ప్రాజెక్ట్ ఇక లేన‌ట్టేన‌ని పుకార్లు పుట్టించారు. అంతే కాకుండా ఈ మూవీ ఆల‌స్యం అవుతున్న నేప‌థ్యంలో త్రివిక్ర‌మ్ మ‌ధ్య‌లో `అఆ` లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాని చేయాల‌నే ఆలోచ‌న‌లో వున్నార‌ని, అది పూర్త‌యిన త‌రువాతే మ‌హేష్ సినిమాని ప‌ట్టాలెక్కిస్తార‌ని వార్త‌లు షికారు చేశాయి.

అయితే తాజాగా మ‌హేష్ - త్రివిక్ర‌మ్ ల ప్రాజెక్ట్ ఫార్మ‌ల్ పూజ‌ని గురువారం పూర్తి చేసుకోవ‌డంతో ఇన్ని నెల‌లుగా ఈ ప్రాజెక్ట్ పై వినిపిస్తున్న పుకార్ల‌కు ఫుల్ స్టాప్ ప‌డింది. ఇక ప్ర‌స్తుతం `స‌ర్కారు వారి పాట‌` చిత్రీక‌ర‌ణ ఫైన‌ల్ షెడ్యూల్ ఈ నెల‌లో ప్రారంభం కానున్న నేప‌థ్యంలో త్రివిక్ర‌మ్ మూవీ మార్చి నుంచి ప‌ట్టాలెక్కే అవ‌కాశం వుంద‌ని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చ‌క‌చ‌కా జరిగిపోతున్నాయ‌ట‌.

త‌మ‌న్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మ‌ది ఛాయాగ్ర‌హకుడిగా , ఏ.ఎస్ . ప్రకాష్ ఆర్ట్ డైరెక్ట‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దాదాపు 12 ఏళ్ల విరామం త‌రువాత మ‌హేష్ - త్రివిక్ర‌మ్ ల క‌ల‌యిక‌లో రానున్న మూవీ కావ‌డంతో ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.