Begin typing your search above and press return to search.

నందమూరి బ్యాక్ బోన్.. ఈసారైనా నిలబడతాడా?

By:  Tupaki Desk   |   3 March 2019 12:22 PM GMT
నందమూరి బ్యాక్ బోన్.. ఈసారైనా నిలబడతాడా?
X
టాలీవుడ్లో ఈ మధ్య పీర్వోలు సైతం నిర్మాతలుగా మారుతున్నారు. ఇంతకుముందు కొన్ని సినిమాలకు ప్రొడక్షన్లో పని చేసిన ఎస్కేఎన్.. ‘ట్యాక్సీవాలా’తో పూర్తి స్థాయి నిర్మాతగా మారి బ్లాక్ బస్టర్ విజయాన్ని ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. అతడి కంటే ముందు బీఏ రాజు చాలా ఏళ్లుగా నిర్మాతగా కొనసాగుతున్నారు. మరో సీనియర్ పీఆర్వో మహేష్ కోనేరు.. ‘నా నువ్వే’ సినిమాతో నిర్మాత అవతారం ఎత్తాడు. అతను నందమూరి అన్నదమ్ములు కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్‌ లకు వ్యక్తిగత పీఆర్వో. చాలా ఏళ్లుగా ఈ అన్నదమ్ములతో అతడికి అనుబంధం ఉంది. వాళ్లిద్దరూ చేసే ప్రతి సినిమాకూ అతను బ్యాక్ బోన్‌ గా నిలుస్తుంటాడు. పీఆర్ పనులతో పాటు నిర్మాణ వ్యవహారాలు కూడా పర్యవేక్షిస్తుంటాడు. వ్యక్తిగతంగా కూడా తారక్, కళ్యాణ్‌ లకు అతను అత్యంత సన్నిహితుడు.

ఆ సాన్నిహిత్యంతోనే అతడిని నిర్మాతగా కూడా లాంచ్ చేశాడు కళ్యాణ్ రామ్. అతను హీరోగా నటించిన ‘నా నువ్వే’ మహేష్‌ కు నిర్మాతగా తొలి సినిమా. టాప్ టెక్నీషియన్లను పెట్టుకుని కొంచెం ఎక్కువ బడ్జెట్టే పెట్టి ఈ లవ్ స్టోరీ తీశాడు మహేష్. కానీ ఆ చిత్రం దారుణాతి దారుణమైన ఫలితాన్నందించింది. పెట్టిన పెట్టుబడి మొత్తం బూడిదలో పోసిన పన్నీరైంది. అయినప్పటికీ భయపడకుండా మళ్లీ కల్యాణ్ రామ్‌ తోనే ‘118’ అనే థ్రిల్లర్ మూవీని నిర్మించాడు. గత సినిమాకు వేరే వాళ్ల భాగస్వామ్యం కూడా ఉండటం వల్ల భారం పూర్తిగా మహేష్ మీద పడలేదు. కానీ ‘118’కు మాత్రం అతనే పూర్తి స్థాయి నిర్మాత. ఈ చిత్రాన్ని పరిమిత బడ్జెట్లో పూర్తి చేసి దిల్ రాజు ద్వారా రిలీజ్ చేయించి కొంచెం జాగ్రత్త పడ్డాడు. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఓ మోస్తరు వసూళ్లతో సాగుతోంది. వీక్ డేస్‌ లో సినిమా ఎలా ఆడుతుందన్నదాన్ని బట్టి ఇది బ్రేక్ ఈవెన్‌ కు వస్తుందా లేదా అన్నది తెలుస్తుంది. థియేట్రికల్ రన్‌ ను బట్టి శాటిలైట్, డిజిటల్ హక్కులకూ రేట్ వస్తుంది. మరి రెండో సినిమాతో అయినా మహేష్ బయటపడతాడో లేదో చూడాలి.