Begin typing your search above and press return to search.

డ్రగ్స్‌ కు బానిసై బంగారం లాంటి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు!

By:  Tupaki Desk   |   26 Jun 2020 3:55 PM IST
డ్రగ్స్‌ కు బానిసై బంగారం లాంటి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు!
X
నేడు అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవం. ప్రతీ సంవత్సరం జూన్‌ 26న అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినాన్ని జరుపుకుంటారు. మత్తు పదార్ధాల వినియోగం వల్ల ఏర్ప‌డు దుష్ఫలితాలు గురించి, అక్రమ రవాణాను అరికట్టడం పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశ్యం. 1987 నుంచి ఐక్యరాజ్యసమితి ప్రపంచ వ్యాప్తంగా మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దేశ దేశాల ప్రభుత్వాలను ఈ మహమ్మారి వ్యాప్తి గురించి హెచ్చరిస్తోంది. కాగా అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన వెబినార్ కార్యక్రమంలో మెగాస్టార్‌ చిరంజీవి, చెస్ క్రీడాకారిణి నైన జశ్విన్, పలువురు సీనియర్ ఐపీఎస్‌ అధికారులు, పలు కళాశాలల విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ సవాంగ్‌ సే నో టు డ్రగ్స్ అంటూ అవగాహన కార్యక్రమాల బ్రోచెర్‌ ను విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా యువత డ్రగ్స్‌ కు బానిసై బంగారం లాంటి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని.. యువత మత్తు పదార్థాలకు బానిసవ్వటం మనసును కలిచివేస్తోందని మెగాస్టార్‌ చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి వెబినార్‌ ద్వారా మాట్లాడుతూ.. ''యాంటీ డ్రగ్‌ ప్రచారం చేయటానికి పూనుకున్న ఏపీ పోలీసు వారిని.. డీజీపీ సవాంగ్‌, ఇతర అధికారులు, వెబినార్‌ సమావేశంలో పాల్గొన్న వారందరిని స్వాగతిస్తున్నా. ఎన్నో జన్మల పుణ్య ఫలం మనిషి జన్మ. లైఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్. అందమైన జీవితాన్ని మత్తుకు బానిసై అస్తవ్యస్తం చేసుకోవటం అవసరమ.. క్షణికానందం కోసం నిండు నూరేళ్ల జీవితాన్ని పణంగా పెట్టడం ఎంత వరకు సమంజసం. మన మీద ఆధారపడ్డ కుటుంబాల్ని వీధిన పడేయటం సమంజసమా. దురలవాట్లకు బానిసైన మిమ్మల్ని చూసి కన్న తల్లిదండ్రులు ఎంత బాధపడతారో ఒక్కసారి వాళ్ల వైపు నుంచి ఆలోచించండి. మీ పిల్లలు కూడా ఇలానే చేస్తే ఆనందపడతారా.. బాధ్యతగా వ్యవహరిస్తే మీ జీవితం నందనవనం అవుతుంది'' అని సందేశం ఇచ్చారు.