Begin typing your search above and press return to search.

సీనియ‌ర్ న‌టి క‌విత ఇంటికి ‘మా’ బృందం!

By:  Tupaki Desk   |   4 July 2021 9:30 AM GMT
సీనియ‌ర్ న‌టి క‌విత ఇంటికి ‘మా’ బృందం!
X
క‌రోనా మ‌హ‌మ్మారి సినీ ప‌రిశ్ర‌మ‌పై మూడు విధాలుగా గ‌ట్టి దెబ్బ కొట్టింది. షూటింగులు ఆగిపోవ‌డం ద్వారా ఉపాధి దూర‌మై కార్మికులు ఆక‌లితో అల‌మ‌టిస్తున్నారు. సినిమాలు రిలీజ్ కాక నిర్మాత‌లు ఇబ్బంది ప‌డుతున్నారు. ఇక‌, ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డి ఇప్ప‌టి వ‌ర‌కూ ఎంతో మంది ప్ర‌ముఖులు ప్రాణాలు కోల్పోయారు. న‌టులు, ద‌ర్శ‌కులు, టెక్నీషియ‌న్స్ ఎంతో మంది అన్యాయంగా చ‌నిపోయారు.

మే నెల‌లో ఏకంగా న‌లుగురు యువ‌ ద‌ర్శ‌కులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా.. సీనియ‌ర్ న‌టి క‌విత కుటుంబంలోనూ అంతులేని విషాదాన్ని నింపింది క‌రోనా మ‌హ‌మ్మారి. ఆమె కుమారుడిని, భ‌ర్త‌ను పదిహేను రోజుల వ్య‌వ‌ధిలోనే బ‌లిగొన్న‌ది. తొలుత ఆమె కుమారుడు సంజ‌య్ రూప్ క‌రోనాతో చ‌నిపోయారు.

క‌రోనా పాజిటివ్ రావ‌డంతో హోం క్వారంటైన్లోఉన్న సంజ‌య్‌.. ప‌రిస్థితి తీవ్రం కావ‌డంతో ఆసుప‌త్రిలో చేరారు. కానీ.. ఉప‌యోగం లేక‌పోయింది. అప్ప‌టికే ఆరోగ్యం విష‌మించ‌డంతో జూన్ 15వ తేదీన ఆయ‌న ప్రాణాలు కోల్పోయారు. ఆ త‌ర్వాత న‌టి క‌విత భ‌ర్త ద‌శ‌ర‌థ‌రాజు కూడా క‌రోనా బారిన ప‌డి ఆసుప‌త్రిలో చికిత్స పొందారు. ఆయన పరిస్థితి కూడా విషమించడంతో.. జూన్ 30వ తేదీన తుది శ్వాస విడిచారు.

కవిత చిన్న తనంలోనే ఇండ‌స్ట్రీలోకి ప్ర‌వేశించారు. 1976లో త‌మిళంలో ఓహ్ మంజు, టాలీవుడ్ లో సిరిసిరి మువ్వ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా వ‌ర్క్ చేశారు. అప్పుడు క‌విత వ‌య‌సు కేవ‌లం ప‌దేళ్లు కావ‌డం విశేషం. చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ మొద‌లు పెట్టిన ఆమె.. ఆ త‌ర్వాత‌ అంచెలంచెలుగా ఎదిగారు. హీరోయిన్ గా మారిన త‌ర్వాత ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణ, శోభ‌న్ బాబు, మెగాస్టార్ స‌ర‌స‌న కూడా న‌టించారు.

కేవ‌లం రెండు వారాల వ్య‌వ‌ధిలోనే కొడుకును, భ‌ర్త‌ను దూరం చేసుకున్న క‌విత తీవ్ర విషాదంలో మునిగిపోయారు. దీంతో.. సినీ ప్ర‌ముఖులు ఆమె నివాసానికి వెళ్లి ఓదార్చి వ‌స్తున్నారు. తాజాగా.. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్‌ స‌భ్యులు కూడా వెళ్లి వ‌చ్చారు. అధ్య‌క్షుడు న‌రేష్ తోపాటు ఇత‌ర స‌భ్యులు క‌విత‌ను క‌లిసి ఓదార్చారు. ఎలాంటి అవ‌స‌రం వ‌చ్చినా తాము ఉన్నామ‌ని భ‌రోసా ఇచ్చారు.