Begin typing your search above and press return to search.

కొడుకును గెలిపించటం కోసం మీరిలా ఓడటమా మోహన్ బాబు?

By:  Tupaki Desk   |   13 Oct 2021 3:40 AM GMT
కొడుకును గెలిపించటం కోసం మీరిలా ఓడటమా మోహన్ బాబు?
X
కొన్ని నిజాలు ఓపెన్ గా మాట్లాడాల్సిన సమయం వచ్చేసింది. మరింత కాలం ఎందుకు మాట్లాడలేదన్న ప్రశ్న రావొచ్చు. నిజాల్ని నిజాలుగా చెప్పినా.. నమ్మటానికి ఇష్టపడాలి కదా? మరిప్పుడు నమ్ముతారా? అంటే.. నమ్మటమా? లేదా? అన్నది పక్కన పెడితే.. కొన్ని విషయాలను చర్చకు తెచ్చే అవకాశాన్ని తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు కల్పించాయని చెప్పాలి. హోరాహోరీగా సాగిన ‘మా’ ఎన్నికల ఫలితాలు వెలువడిన రెండో రోజు సాయంత్రం వేళలో ప్రకాశ్ రాజ్ టీం నిర్వహించిన ప్రెస్ మీట్ పెను సంచలనంగా మారటమే కాదు.. తెలుగుసినిమా ఇండస్ట్రీ మీద ఉండే చాలా భ్రమల్ని తొలగించేలా చేసింది.

అంతేకాదు.. ఈ సందర్భంగా కొత్త నిజాలు తెర మీదకు వచ్చాయి. అందులో కీలకమైనది మోహన్ బాబు మీద ప్రకాశ్ రాజ్ ప్యానల్ కు చెందిన పలువురు చేసిన వ్యాఖ్యలు. సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సుపరిచితుడు బెనర్జీ లాంటి వారైతే కన్నీళ్లు పెట్టేసుకున్నారు. తెర మీద భయంకరమైన విలనిజం ప్రదర్శించే ఆయన.. మీడియా ఎదుట చిన్న పిల్లాడిలా ఏడవటమే కాదు.. తన ఎమోషన్ ను నటన అనే మరక వేస్తారేమో అన్న భయాన్ని వ్యక్తం చేస్తూనే..మోహన్ బాబు ఇంట్లో మంచు మనోజ్.. లక్ష్మీలను తాను ఎత్తుకొని పెంచానని.. అలాంటి తనను బండ బూతులు తిట్టారని..ఈ వయసులో ఇలా మాటలు అనిపించుకోవటం అవసరమా? అన్న మాటతో పాటు.. మోహన్ బాబు సతీమణి సైతం ఫోన్ చేసి ఓదార్చారన్న మాటల్ని విన్నప్పుడు.. బెనర్జీ మాటల్ని నమ్మక తప్పని పరిస్థితి.

ఒకవేళ మోహన్ బాబు సతీమణి నేరుగా మీడియాతో మాట్లాడి.. బెనర్జీ మాటలు తప్పు అని ఖండిస్తే తప్పించి.. ఆయన మాటల్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదనే చెప్పాలి. ఇక.. సుదీర్ఘంగా సాగిన సంచలన ప్రెస్ మీట్ లో.. ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మోహన్ బాబు మీద ఇండస్ట్రీలో చాలా విధాలుగా కామెంట్ చేస్తారు. మీడియాలో సైతం తన మీద నెగిటివ్ గా వస్తే ఆయన శివాలు ఎత్తుతారని.. ఆయన నోటికి భయపడి చాలామంది సినిమా రిపోర్టర్లు.. ఆయన ఆగ్రహాన్ని.. ఆయన ఆవేశం గురించి రాసింది లేదు.

సీనియర్ నటుడు కావటం..యూత్ లో ఆయనకున్న ఛరిష్మా అంతంత మాత్రం కావటం.. ఆయన గురించి రాసి లేనిపోని వివాదాల్ని నెత్తిన వేసుకునే కన్నా.. కాస్త దూరంగా ఉండాలన్న మాట.. మీడియాలోనూ చాలామంది సీనియర్ సినిమా రిపోర్టర్లు చెబుతుంటారు. ఆ మాటలన్ని పచ్చి నిజాలన్నట్లుగా తాజా ఆరోపణల్ని చూస్తే అనిపించక మానదు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. కొడుకు మంచు విష్ణు గెలుపు కోసం మోహన్ బాబు బరితెగించిన వైనంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇంతకాలం ఒక మాట అనేందుకు వెనుకా ముందు చూసుకునే వారని.. పోలింగ్ సందర్భంగా ఆయన అందరిని కెలకటం ద్వారా.. తన ఇమేజ్ ను తానే బర్ బాద్ చేసుకున్నారన్న మాట వినిపిస్తోంది. వేలెత్తి చూపించేందుకు భయపడే పరిస్థితి నుంచి.. వేలు చూపించి మరీ.. మోహన్ బాబు ఇలా చేశారు? ఏమైనా న్యాయం ఉందా? అని సూటిగా అడిగేసే వరకు ఆయన తెచ్చుకున్నారని చెప్పాలి. కొడుకును ఎన్నికల్లో గెలిపించటం కోసం ఆయనీ వయసులో చాలామంది మనసుల్లో ఓడిపోవటం అవసరమా? అన్న మాట వినిపిస్తోంది.