Begin typing your search above and press return to search.

చైతూ - వెంక‌ట్ ప్ర‌భు ఆ రీమేక్ చేయ‌డం లేదా?

By:  Tupaki Desk   |   28 March 2022 7:08 AM GMT
చైతూ - వెంక‌ట్ ప్ర‌భు ఆ రీమేక్ చేయ‌డం లేదా?
X
యంగ్ హీరో అక్కినేని నాగ‌చైత‌న్య వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్నారు. ఆ జోష్ లోనే బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌ని లైన్ లో పెట్టేస్తున్నారు. ఇటీవ‌ల `సోగ్గాడే చిన్నినాయ‌న‌` చిత్రానికి సీక్వెల్ గా వ‌చ్చిన `బంగార్రాజు`తో ఈ సంక్రాంతికి సంద‌డి చేసిన విష‌యం తెలిసిందే. సోలోగా ర‌ఫ్ఫాడించేసిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌నే రాబ‌ట్టింది. రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కిన ఈ చిత్రం ఒకే సారి ఇటు చైతూకు, అటు నాగార్జున‌కు మంచి విజ‌యాన్ని అందించింది.

ఈ మూవీ త‌రువాత నాగ‌చైత‌న్య `థ్యాంక్యూ` చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. `మ‌నం` ఫేమ్ విక్ర‌మ్ కె. కుమార్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. దిల్ రాజు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న ఈ మూవీలో రాశిఖన్నా, అవికా గోక‌ర్ హీరోయిన్ లుగా న‌టిస్తున్నారు. ఇటీవ‌లే కీల‌క స‌న్నివేశాల‌ని స్విట్జ‌ర్లాండ్‌లో పూర్తి చేశారు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందుతున్న ఈ మూవీపై నాగ‌చైత‌న్య భారీ అంచ‌నాలే పెట్టుకున్నార‌ట‌.

ఇదిలా వుంటే ఈ మూవీ త‌రువాత నాగ‌చైత‌న్య చేయ‌నున్న చిత్రంపై సందిగ్ధ‌త నెల‌కొన్న‌ట్టుగా క‌నిపిస్తోంది. ఓ ప‌క్క విక్ర‌మ్ కె కుమార్ తో `థ్యాంక్యూ` మూవీ చేస్తున్న నాగ‌చైత‌న్య మ‌రో ప‌క్క ఇదే ద‌ర్శ‌కుడితో `దూత‌` అనే వెబ్ సిరీస్ ని చేస్తున్నాడు. ప‌ది భాగాలుగా తెర‌కెక్క‌నున్న ఈ వెబ్ డ్రామా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది.

ప్ర‌స్తుతం ఈ వెబ్ సిరీస్ చిత్రీక‌ర‌ణ లో నాగ‌చైత‌న్య‌, విక్ర‌మ్ కె. కుమార్ చాలా బిజీగా వున్నారు. ఈ సిరీస్ త‌రువాత నాగ‌చైత‌న్య త‌మిళ ద‌ర్శ‌కుడు వెంక‌ట్ ప్ర‌భుతో ఓ ద్విభాషా చిత్రం చేయ‌బోతున్నారంటూ ఇటీవ‌ల వార్త‌ల వినిపించాయి. తాజాగా ఈ వార్త‌లు నిజ‌మేనంటూ ద‌ర్శ‌కుడు వెంక‌ట్ ప్ర‌భు ఓ త‌మిళ సినిమా ప్ర‌మోష‌న్ లో క్లారిటీ ఇచ్చారు.

త‌మిళ చిత్రం `మ‌న్మ‌థ‌లీల‌` ప్ర‌మోష‌న్స్ లో పాల్లొంటున్న వెంక‌ట్ ప్ర‌భు త‌న త‌దుప‌రి చిత్రాన్ని నాగ‌చైత‌న్య‌తో చేయ‌బోతున్నాన‌ని ప్ర‌క‌టించారు. అయితే ఇది `మ‌నాడు` రీమేక్ కాద‌ని స్ప‌ష్టం చేశాడు. ఈ మూవీ రీమేక్ రైట్స్ ని సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ సొంతం చేసుకుంది. తెలుగులో ప్ర‌ముఖ హీరోతో దీన్ని రీఅమేక్ చేయాల‌నుకుంటోంది. దీనికి వెంక‌ట్ ప్ర‌భునే ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నారు. ఇదిలా వుంటే తాను నాగ‌చైత‌న్య‌తో చేయ‌బోయే సినిమా `మ‌నాడు` రీమేక్ కాదని, ఓ కొత్త క‌థ‌తో చేయ‌బోతున్నాన‌ని చెప్పాడు.

కానీ బ‌య‌ట జ‌రుగుతున్న ప్రచారం, ఈ మూవీని సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ నిర్మించ‌డానికి రెడీ అవుతున్న తీరుని బ‌ట్టి చూస్తే మాత్రం వెంక‌ట్ ప్ర‌భు - నాగ‌చైత‌న్య కాంబినేష‌న్ లో రాబోతున్న సినిమా `మ‌నాడు` రీమేక్ అని స్ప‌ష్టం అవుతోంది. వెంక‌ట్ ప్ర‌భు మాత్రం అది కాద‌ని చెబుతుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ చిత్రంలో నాగచైత‌న్య‌కు జోడీగా పూజా హెగ్డే న‌టించ‌నుంద‌ని తెలిసింది. గ‌తంలో నాగ‌చైత‌న్య - పూజా హెగ్డే `ఒక లైలా కోసం` చిత్రంలో క‌లిసి న‌టించారు. ఇది వారి క‌ల‌యిక‌లో రానున్న రెండ‌వ సినిమా. కాగా ఈ మూవీని ఏప్రిల్ ఫ‌స్ట్ వీక్ లో సెట్స్ పైకి తీసుకెళ్ల‌బోతున్నార‌ని తెలిసింది.