Begin typing your search above and press return to search.

దిగ్గజ గాయని దిగులు చెందిన వేళ

By:  Tupaki Desk   |   21 July 2017 5:08 AM GMT
దిగ్గజ గాయని దిగులు చెందిన వేళ
X
లండన్ లోని వెంబ్లీ స్టేడియంలో ఏఆర్ రెహమాన్ కు ఎదురైన అనుభవం.. దేశీయ సంగీత ప్రపంచాన్ని కదిలించేస్తోంది. రెహమాన్ తమిళ్ పాటలు ఎక్కువగా పాడడంతో.. తాము మోసపోయామని.. తమ డబ్బులు వెనక్కి తిరిగి ఇవ్వాలని ఆడియన్స్ నానా హంగామా చేశారు. సంగీతానికి భాషా బేధం ఉండదని ప్రపంచం విశ్వసించి ఆరాధిస్తుంటే.. ప్రాంతీయతత్వం మనవాళ్లలో ఏ స్థాయిలో పేరుకుపోయిందో చెప్పేందుకు ఈ సంఘటన ఒక ఉదాహరణగా మారింది.

అదే స్టేడియంలో పలు మార్లు తన సంగీత కచేరీలను నిర్వహించిన దిగ్గజ గాయని లతా మంగేష్కర్.. ఈ వివాదంపై స్పందించారు. 'మన ప్రేక్షకులలో చాలా మంది సహనం వహించలేని వారు ఉన్నారు. నా 70ఏళ్ల అనుభవంలో అనేక భాషల్లో నేను పాటలు పాడాను. పంజాబి.. బెంగాలీ.. డోగ్రీ భాషల్లో కూడా పాటలు పాడాను. ప్రజలు భాషను కాకుండా.. ఆ పాటలు వినేందుకు ఎక్కువ ఉత్సాహం చూపేవారు. రెహమాన్ స్వరపరిచిన ఎన్నో పాటలు మొదట తమిళ్ కోసం కూర్చినవే. ఆ తర్వాత వాటికి హిందీ వెర్షన్ కూడా సిద్ధం చేయగా.. అవి కూడా విజయం సాధించాయి. ఇప్పుడు రెహమాన్ గారి విషయంలో జరిగినది సరైన విషయం కాదు' అన్నారు లతా మంగేష్కర్.

'సంగీతానికి హద్దులు ఉండవు. భాషా బేధం అంతకంటే ఉండదు. నేను ప్రతీ భాషలోనూ పాటలు పాడడాన్ని ఎంజాయ్ చేస్తాను. ఆయా పదాల ఉచ్ఛారణ సరిగా పలకలేదేమో అన్న ఒక్కటే నా భయం. ఇప్పటివరకూ నన్ను ఆ విషయంలో ఎవరూ ప్రశ్నించలేదు' అంటున్న లతా మంగేష్కర్.. 38 భాషల్లో పాటలు పాడారు.