Begin typing your search above and press return to search.

కీరవాణి రాగంలో అంటున్న పవర్ స్టార్...!

By:  Tupaki Desk   |   24 April 2020 2:30 PM GMT
కీరవాణి రాగంలో అంటున్న పవర్ స్టార్...!
X
రాజకీయాల కారణంగా సినిమాలకు దూరమైన పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలను ఓకే చేస్తున్నాడు. ముందుగా తన కెరీర్లో 26వ చిత్రంగా 'వకీల్ సాబ్'ని పట్టాలెక్కించాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకుడు. ఈ సినిమా తరువాత పవన్‌ కళ్యాణ్ ప్రముఖ దర్శకుడు జాగర్లమూడి క్రిష్‌ దర్శకత్వంలో పీరియాడికల్ మూవీ చేయనున్నాడు. మొఘలాయిల కాలం నేపథ్యంలో నడిచే ఈ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మితం కానుంది. బడా నిర్మాత ఏఎమ్ రత్నం నిర్మిస్తున్న ఈ సినిమాను తెలుగుతో పాటు ఇతర భాషల్లోను విడుదల చేయనున్నారు. అయితే ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టరుగా ఎవరిని తీసుకుంటారని మొదటి నుండి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కారణం ఇది పీరియాడిక్ సినిమా కావడంతో ప్రస్తుత సంగీత దర్శకులు ఏమాత్రం న్యాయం చేయగలరని వారి అనుమానం. అంతేకాకుండా పవర్ స్టార్ మొదటి సినిమా నుండి ఇప్పటి దాకా ఆయన సినిమాలు ప్లాప్ అయినా మ్యూజిక్ మాత్రం ఎప్పుడు ఫెయిల్ అవలేదు. ఆయన నటించిన డిజాస్టర్ సినిమాలు కూడా మ్యూజికల్ గా మంచి గుర్తింపుని పొందినవే. పవన్ సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్లు రిపీటెడ్ గా ఉంటారు. పవన్ కి ఒక మ్యూజిక్ డైరెక్టర్ నచ్చితే వారినే కంటిన్యూ చేసే అలవాటు ఉంది. రమణ గోగుల, మణిశర్మ లాంటి వారే దానికి ఉదాహరణ.

అయితే పవన్ - క్రిష్ కాంబోలో రాబోయే సినిమాకి ఒక సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ ని తీసుకున్నారట. ఆయనే కీరవాణి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ - క్రిష్ ప్రాజెక్ట్ కూడా చేయబోతున్నట్టు కన్ఫార్మ్ చేశారు కీరవాణి. రాజమౌళి ఆస్థాన దర్శకుడిగా ముద్రపడిన కీరవాణి తన 30 ఏళ్ళ కెరీర్లో ఎన్నో అద్భుతమైన చిత్రాలకు అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. ఎన్నో చారిత్రక, పౌరాణిక, జానపద చిత్రాలకు కీరవాణి అందించిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అదనపు బలాన్ని చేకూర్చాయి. ఇండియన్ బాక్సాఫీస్ వండర్ ‘బాహుబలి’ సినిమా విజయంలో స్వరకర్త కీరవాణికి కూడా భాగం ఇవ్వాల్సిందే. ఇప్పుడు ఈ పీరియాడికల్ మూవీకి కూడా కీరవాణి మంచి సంగీతాన్ని అందిస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే క్రిష్ - పవన్ కళ్యాణ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాకు కీరవాణిని సంగీత దర్శకుడిగా తీసుకున్నారట. అంతేకాకుండా క్రిష్ - కీరవాణి గతంలో 'వేదం' సినిమాకి పని చేసారు. ఈ పరిచయంతో కీరవాణి ఈ సినిమాకి సంగీతాన్ని అందించడానికి ఒప్పుకున్నట్లు సమాచారం. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో పలువురు ఇతర ఇండస్ట్రీ నటీనటులను కూడా తీసుకోబోతున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'వకీల్ సాబ్' పూర్తయిన వెంటనే ఈ సినిమా పట్టాలెక్కించే అవకాశం ఉంది.