Begin typing your search above and press return to search.

నిర్భయ కేసు పై హీరో కార్తీ ఫైర్..

By:  Tupaki Desk   |   20 March 2020 8:00 PM IST
నిర్భయ కేసు పై హీరో కార్తీ ఫైర్..
X
భారతదేశాన్ని కలవరపరిచి కంటతడి పెట్టించిన దారుణ 'నిర్భయ' ఘటనకు ఈరోజు న్యాయం జరిగింది. గత ఎనిమిదేళ్లుగా ముందుకు కదలని నిర్భయ కేసు ఈరోజు దోషులను ఉరి తీయడంతో దేశ ప్రజలు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ నిర్భయ రేప్ ఘటన తర్వాత ఎన్నో అతి దారుణమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. నిర్భయ ఘటనకు న్యాయం జరగడానికి ఎనిమిదేళ్లు పట్టింది. మరి మిగిలిన కేసులకు ఎప్పుడు జరుగనుందో.. అసలు న్యాయం జరుగుతుందో లేదో తెలియదని ప్రజలు భావిస్తున్నారు. అయితే నిర్భయ దోషుల ఉరిశిక్షపై ప్రజలతో పాటు సినీ ఇండస్ట్రీకి చెందిన సెలెబ్రిటీలు కూడా వారి అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు.

అందరు మర్చిపోయిన తర్వాత న్యాయం జరిగితే ఏం లాభమని కొందరు అభిప్రాయపడుతుంటే.. మరి కొందరు న్యాయం జరిగినందుకు సంతోషించు అని సమర్ధించుకుంటున్నారు. అయితే ఈ ఉరిశిక్ష పై సౌత్ ఇండియన్ హీరో కార్తీ ట్విట్టర్లో ట్వీట్ ద్వారా స్పందించాడు. 'నిర్భయ కేసుకే సగం దేశం మర్చిపోయాక న్యాయం జరిగితే మరి రోజురోజుకు నమోదవుతున్న కేసులకు న్యాయం ఎప్పుడు జరుగుతుంది. పొల్లాచిలో 16యేళ్ల బాలిక కేసుకి ఆల్రెడీ సంవత్సరం గడిచింది. ఈ కేసుకు ఎన్ని సంవత్సరాలకు న్యాయం జరుగుతుందో మరి.. ఆశ్చర్యంగా ఉంది! ఒక పరిష్కారం కావడానికి ఇన్నేళ్ల సమయం పడుతుందా..! ఇలాంటి ఘటనల నుండి మనం చాలా నేర్చుకోవాల్సి ఉందని' ఆయన అభిప్రాయాన్ని తెలిపారు. ప్రస్తుతం కార్తీ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.