Begin typing your search above and press return to search.

సుశాంత్ మరణంతో ఆ ప్రొడ్యూసర్ పరిస్థితి దయనీయంగా మారిందట...!

By:  Tupaki Desk   |   9 July 2020 12:30 AM GMT
సుశాంత్ మరణంతో ఆ ప్రొడ్యూసర్ పరిస్థితి దయనీయంగా మారిందట...!
X
యువ హీరో హీరో సుశాంత్ సింగ్ రాజ్‌ పుత్ మరణంతో బాలీవుడ్ లో పలువురు ప్రముఖులపై సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇండస్ట్రీ మాఫియాపైనా.. నెపోటిజం పైనా సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. కరణ్ జోహార్, సల్మాన్ ఖాన్, ఆలియా భట్, మహేష్ భట్, సోనమ్ కపూర్, కరీనా కపూర్ వంటి బాలీవుడ్ ప్రముఖులపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఈ క్రమంలో వారి నుండి వచ్చే చిత్రాలను బాయ్ కాట్ చేయాలని కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా దర్శక నిర్మాత కరణ్ జోహార్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు నెటిజన్స్. ఇండస్ట్రీకి చెందిన కుటుంబాల వారసులని ఇంట్రడ్యూస్ చేస్తూ వారినే ప్రోత్సహిస్తుంటాడని.. బయట నుంచి వచ్చే యువ టాలెంటెడ్ యాక్టర్స్ ని అణిచివేస్తారనే విమర్శలు చేస్తున్నారు. అంతేకాకుండా సుశాంత్ సింగ్ రాజ్‌ పుత్ మరణానికి పరోక్షంగా కారణమైన వారిలో కరణ్ జోహార్ ఒకరని కామెంట్స్ చేస్తున్నారు.

కాగా కరణ్ జోహార్ ప్రొడక్షన్ లో సుశాంత్ సింగ్ రాజ్‌ పుత్ 'డ్రైవ్' అనే సినిమాలో నటించాడు. జాక్వలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఎవరూ ఊహించని విధంగా గతేడాది థియేటర్స్ లో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ చేశారు. సుశాంత్ సినిమా ఓటీటీలో రిలీజ్ చేయడం అప్పట్లో చర్చనీయాంశం అయింది. ఉద్దేశపూర్వకంగానే సుశాంత్ కెరీర్‌ ను దెబ్బ తీయడానికి కరణ్ కుట్ర పన్నారనే విమర్శలు వచ్చాయి. అంతేకాకుండా కరణ్ జోహార్ 'కాఫీ విత్ కరణ్' షో లో కావాలనే ప్రతి ఒక్క సెలబ్రిటీని తాను అడిగే ప్రశ్నలలో సుశాంత్ ని ఇన్వాల్వ్ చేస్తూ అతన్ని తక్కువ చేసేలా చూస్తాడని కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో అదే స్థాయిలో ఇప్పుడు కరణ్ జోహార్ ట్రోల్ల్స్ ఎదుర్కొంటున్నాడు. అయితే సుశాంత్ మరణం తర్వాత కరణ్ జోహర్ పరిస్థితి ఏలా మారిందనే విషయాన్ని ఆయన సన్నిహితులు వెల్లడించారట.

సుశాంత్ మరణం తర్వాత జరిగిన ట్రోల్స్ తో కరణ్ జోహర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడట. సుశాంత్ మరణంతో కుంగిపోయి.. ప్రతి రోజూ ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయట. ప్రస్తుతం కరణ్ ఎవరితోనూ మాట్లాడే పరిస్థితిలో లేడని.. ఆయన మానసిక పరిస్థితి దారుణంగా తయారైందని కరణ్ సన్నిహితులు చెప్పుకొచ్చారట. ఒకవేళ ఎవరైనా ఈ టాపిక్ పై కదిలిస్తే నాలాంటి వ్యక్తిపై ఇలాంటి ఆరోపణలు రావడం ఏంటని ఏడుస్తున్నాడట. అంతేకాకుండా సుశాంత్ సింగ్ మరణం తర్వాత పలువురు బెదిరింపులకు పాల్పడుతున్నారని.. వ్యక్తిగత దాడులకు దిగుతామని హెచ్చరిస్తున్నారని.. అతని కవల పిల్లలను కూడా చంపేస్తామని బెదిరిస్తున్నారని కరణ్ జోహర్ తన సన్నిహితుల దగ్గర చెప్పుకొని వాపోయాడట. ప్రస్తుతం కరణ్ జోహర్ పరిస్థితి దయనీయంగా మారిందని కరణ్ సన్నిహితుడు ఆవేదన వ్యక్తం చేశారట.