Begin typing your search above and press return to search.

బాత్రూం ఎపిసోడ్ మీద క్లారిటీ ఇచ్చిన సింగర్

By:  Tupaki Desk   |   22 March 2020 5:24 AM GMT
బాత్రూం ఎపిసోడ్ మీద క్లారిటీ ఇచ్చిన సింగర్
X
పేరు ప్రఖ్యాతులు దండిగా ఉంటే సరిపోదు. సామాన్యులకు ఉండే అవగాహనలో కాస్తంత ఉన్నా.. సింగర్ కనికా కపూర్ ఇలాంటి తప్పు చేసేవారు కాదన్న మాట వినిపిస్తోంది. కరోనా వ్యాప్తి వేగంగా సాగుతున్న వేళ.. విదేశాల నుంచి వచ్చిన వారు ఎంత ఆరోగ్యంగా ఉన్నప్పటికీ.. పద్నాలుగు రోజుల పాటు హోం క్వారంటైన్ లో ఉండాలన్న అధికారిక మార్గదర్శకల్ని తుంగలోకి తొక్కి.. పార్టీలో పాల్గొనటం ద్వారా ఖరీదైన తప్పును చేశారు కనికా.

ప్రస్తుతం కరోనా పాజిటివ్ గా తేలి.. లక్నోలోని ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న ఆమె కారణంగా.. కరోనా వైరస్ రాజ్యసభకు.. రాష్ట్రపతి భవన్ వరకూ ప్రయాణం చేసినా ఆశ్చర్యపోవాల్సినఅవసరం లేదంటున్నారు. విదేశాల నుంచి భారత్ కు వచ్చిన ఆమె.. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా.. బాధ్యతారాహిత్యంతో ఒక పార్టీలో పాల్గొనటం.. అందులో పలువురు ఎంపీలు ఉండటంతో..అదే సమయంలో ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలటంతో యావత్ దేశం ఈ పార్టీ గురించి తెలిసినంతనే ఉలిక్కిపడటమేకాదు.. తీవ్ర ఆందోళనలకు గురయ్యారు.

ఇదిలా ఉంటే.. విదేశాల నుంచి వచ్చి.. ఎయిర్ పోర్టులో ఆమె కరోనా స్క్రీనింగ్ కు హాజరు కాకుండా బాత్రూంలో ఉండిపోయి తప్పించుకుందన్న వాదన బలంగా వినిపిస్తోంది. దీనికి సంబంధించిన సమాచారం పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో స్పందించిన సింగర్ కనికా.. తన మీద వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని చెప్పారు. ఇంటర్నేషనల్ అరైవల్స్ లో ఉన్న తానుబాత్రూంలో ఉండిపోవటం ద్వారా.. స్క్రీనింగ్ నుంచి తప్పించుకునే అవకాశం లేదంటున్నారు. తాను ఎయిర్ పోర్టులో స్క్రీనింగ్ చేయించుకున్నట్లు చెబుతున్నారు. ముంబయి ఎయిర్ పోర్టులో అధికారులు ఏర్పాటు చేసిన స్క్రీనింగ్ పరీక్ష చేయించుకున్నానని.. కావాలంటే సీసీ ఫుటేజ్ చూసుకోవాలని చెబుతున్నారు. తాను బాత్రూంలో ఉండిపోయి.. తప్పించుకున్నట్లుగా వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదంటున్నారు. తాను మార్చి 11నవిదేశాల నుంచి ముంబయికి వచ్చానని.. తనకెవ్వరూ సెల్ప్ క్వారంటైన్ లో ఉండాలని చెప్పలేదంటున్నారు. ఒకరు చెప్పాలా? ప్రపంచాన్ని వణికించే వైరస్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలన్న విషయం కనికకు తెలీదా?