Begin typing your search above and press return to search.

మరో వివాదంలో కమల్ ...ఏమైందంటే ?

By:  Tupaki Desk   |   9 May 2020 1:41 PM IST
మరో వివాదంలో కమల్ ...ఏమైందంటే ?
X
లోకనాయకుడు , విలక్షణ నటుడు కమల్ హాసన్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. ప్రఖ్యాత వాగ్గేయకారుడు త్యాగరాజ స్వామిపై కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. ఆయన మాట్లాడిన తీరును తప్పుబడుతూ అయన పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. త్యాగరాజ స్వామిని దేవుడిలా కొలిచే ఎంతోమంది కర్ణాటక సంగీతకారులు కమల్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కమల్ చేసిన వ్యాఖ్యలు తమ మనోభావాలను దెబ్బతీశాయంటూ నిరసనకు దిగారు కర్ణాటక సంగీతకారులు.

24 వేలకు పైగా కృతులు రచించిన త్యాగరాజ స్వామి వారు అంటే కర్ణాటక సంగీత విద్వాంసులకు, విద్యార్థులకు, అభిమానులకు ఆరాధ్యుడు. ఇటీవలే తమిళ హీరో విజయ్ సేతుపతితో కలిసి ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ లైవ్ ప్రోగ్రాంలో పాల్గొన్న కమల్ హాసన్ త్యాగరాజ స్వామిని ఉద్దేశిస్తూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలు ఆసక్తికర విషయాలు చర్చించిన ఆయన.. త్యాగరాజ స్వామిని ఉద్దేశిస్తూ `రాముడిని కీర్తిస్తూ బిచ్చమెత్తి బతికేవాడు` అని వ్యాఖ్యానించారు.

''సినిమా అంటే టిక్కెట్లు అమ్మి డబ్బు సంపాదించే వ్యాపారం. ఇది ఛారిటీ కాదు. త్యాగరాజ స్వామిలా తంజావూరు వీధుల్లో రాముడిని కీర్తిస్తూ బిచ్చమెత్తుకోవడం కాదు'' అన్నారు కమల్. దీనిపై త్యాగరాజ స్వామి భక్తులు ఆగ్రహం వ్యకం చేస్తున్నారు. కమల్ అలా మాట్లాడటం సరికాదని, ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాల్సిందే అని కోరుతూ సంగీతకారుడు పాల్‌ ఘాట్ రామ్ ‌ప్రసాద్ ఆన్ ‌లైన్ పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ ‌కు మద్దతుగా ఇప్పటికే 16వేల మంది సంతకాలు చేయడం గమనార్హం. ఈ వివాదం పై కమల్ ఎలా స్పందిస్తారో చూడాలి.