Begin typing your search above and press return to search.

మినీ రివ్యూ: సమాజానికి కనువిప్పు కలిగించే 'జన గణ మన'

By:  Tupaki Desk   |   6 Jun 2022 3:06 PM GMT
మినీ రివ్యూ: సమాజానికి కనువిప్పు కలిగించే జన గణ మన
X
కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలను అందించడంలో మలయాళ చిత్ర పరిశ్రమ ఎప్పుడూ ముందే ఉంటుంది. కమర్షియల్ హంగులకు దూరంగా కథే పరమావధిగా తెరకెక్కే ఇలాంటి సినిమాల్లో నటించాడని అక్కడి అగ్ర హీరోలు వెనకడుగు వేయరు. వారిలో దర్శక నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విభిన్నమైన చిత్రాలతో ఎప్పుడూ ప్రత్యేకంగా నిలుస్తుంటారు. ఇప్పుడు లేటెస్టుగా ''జన గణ మన'' అనే మరో కంటెంట్ ఆధారిత చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

పృథ్వీరాజ్ సుకుమారన్ - సూరజ్ వెంజరమూడ్ - మమతామోహన్ దాస్ ప్రధాన పాత్రల్లో డిజో జోస్ ఆంటోని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ''జనగణమన''. షరీస్ మహమ్మద్ అందించిన కథతో రూపొందిన ఈ సినిమాని పృథ్వీరాజ్ సుకుమారన్ - లిస్టిన్ స్టీఫెన్ సంయుక్తంగా నిర్మించారు. ఏప్రిల్ 28న థియేటర్లలో విడుదలై ఘనవిజయం సాధించిన ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

'జన గణ మన' తెలుగు వెర్షన్ కూడా ఓటీటీలో అందుబాటులో ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షించింది. నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. నేటి సమాజంలో నెలకొన్న పరిస్థితులు.. కుల, మత, జాతి, వర్ణ విబేధాలు ఏ స్థాయిలో ఉన్నాయి.. విద్య, న్యాయ, పోలీసు, మీడియా, రాజకీయ వ్యవస్థల పాత్ర ఏంటనేది ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు.

కథ విషయానికొస్తే.. యూనివర్సిటీ ప్రొఫెసర్ సబా మరియం (మమతా మోహన్ దాస్)ను రేప్ చేసి.. ఆమెను కాల్చి చంపేశారనే వార్త సంచలనం రేపుతుంది. దీనిపై యూనివర్సిటీ స్టూడెంట్స్ మరియు సభా తల్లి న్యాయపోరాటానికి దిగుతారు. ఈ కేసును ఛేదించేందుకు రంగంలోకి దిగిన ఏసీపీ సజ్జన్(సూరజ్).. ఓ నలుగురుని దుండగ్గులుగా పట్టుకుంటాడు.

వారిని చంపేయాలంటూ ప్రజల నుంచి డిమాండ్స్ వెల్లువెత్తడం.. పైనుంచి ఒత్తిళ్లు రావడంతో ఏసీపీ ఆ నలుగురిని ఎన్ కౌంటర్ చేస్తాడు. దీనిపై మానవ హక్కుల కమీషన్ ఆగ్రహిస్తుంది. కనీసం ఆ నిందితులను న్యాయస్థానంలో ప్రవేశ పెట్టకుండా ఎన్కౌంటర్ చేయడమేంటంటూ లాయర్ అరవింద్ స్వామినాథన్ (పృథ్వీరాజ్ సుకుమారన్) ఈ కేసు వాదిస్తాడు.

ఈ క్రమంలో జరిగిన పరిణామాలు ఏంటి? సభా మరియంను హత్య చేయడానికి కారణమేంటి? దాని వెనుకున్నది ఎవరు? అసలు ఆ ఎన్ కౌంటర్ ఎందుకు చేశారు? ఏసీపీ సజ్జన్ చేసిన ఎన్ కౌంటర్ కు వ్యతిరేకంగా కోర్టులో లాయర్ అరవింద్ సంధించిన ప్రశ్నలు ఏంటి? ఈ కేసులో నిజానిజాలు ఎలా బయటకు వచ్చాయి? అనేది తెలియాలంటే 'జనగణమన' సినిమా చూడాల్సిందే.

'జన గణ మన' సినిమాతో వ్యవస్థనే ప్రశ్నించారు దర్శక రచయితలు. సినిమా చూస్తున్నంత సేపు దేశాన్ని కదిలించిన దిశా దుర్ఘటన మరియు ప్రస్తుతం చట్టం పరిధిలో ఉన్న అత్యంత వివాదాస్పద ఎన్కౌంటర్ మనకు గుర్తుకు వస్తాయి. నిజాన్ని దాచిపెట్టలేమని, ఎప్పుడో ఒకప్పుడు కచ్చితంగా బయటకు వస్తుందని.. ఎప్పటికైనా సత్యమే గెలుస్తుందని ఈ సినిమా చెబుతోంది.

సమాజంలోని విద్యా న్యాయ వ్యవస్థ.. పోలీసులు రాజకీయ వ్యవస్థ.. ఇలా అన్నింటి మీద ప్రశ్నలు సంధించారు. ప్రభుత్వం తమ ఇమేజ్ ను పెంపొందించుకోవడానికి పరిస్థితులను ఎలా ఉపయోగించుకుంటుంది.. విద్యార్థులను ఎలా వాడుకుంటారు? అనే విషయాలను ఈ సినిమా చూపిస్తుంది. అందరినీ ఆలోచింపజేస్తుంది.

ఏది అబద్ధం ఏది నిజం అనేది సమాజం ఎలా నిర్ణయిస్తుంది.. ఏ దృక్కోణంతో ఆలోచిస్తుందో ఎలా ప్రభావితమవుతారు అనే అంశాలను చూపించారు. మన అంతరంగాన్ని స్పష్టంగా ఆవిష్కరించే ఈ సినిమా.. ప్రేక్షకుల్లో అపరాధ భావన కలిగిస్తుంది. ఇది కేవలం సినిమా మాత్రమే కాదు.. ఈ సమాజానికి ఒక కనువిప్పు అని చెప్పాలి.

ఇలాంటి పాయింట్ ను తీసుకొని తెరపైకి తీసుకొచ్చిన దర్శక రచయితలను మెచ్చుకొని తీరాల్సిందే. పృథ్వీరాజ్ సుకుమారన్ మరోసారి అద్భుతమైన నటన కనబరిచారు. ఫస్ట్ హాఫ్ లో సూరజ్ అందరి దృష్టిని ఆకర్షిస్తే.. సెకండ్ హాఫ్ లో పృథ్వీరాజ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. ప్రొఫెసర్ సబా పాత్రలో మమతా మోహన్ దాస్ మెప్పించింది. కోర్టు సన్నివేశాలు - సినిమాలోని డైలాగ్‌ లు హైలెట్‌ గా నిలిచాయి. జేక్స్‌ బిజోయ్‌ నేపథ్య సంగీతం ప్రశంసనీయం.

'జనగణమన' అనేది ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన సినిమా. నెట్ ఫ్లిక్స్ లో తెలుగులో కూడా అందుబాటులో ఉంది కాబట్టి చూసేయండి!.