Begin typing your search above and press return to search.

'జబర్దస్త్' రచ్చ: కమెడియన్ల విమర్శలు ప్రతివిమర్శలు..!

By:  Tupaki Desk   |   15 July 2022 4:36 AM GMT
జబర్దస్త్ రచ్చ: కమెడియన్ల విమర్శలు ప్రతివిమర్శలు..!
X
'జబర్దస్త్' కామెడీ షో ఎంతోమంది ఆర్టిస్టులకు లైఫ్ ఇచ్చిందనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందరో ప్రతిభావంతులైన హాస్యనటులను వెలుగులోకి తీసుకొచ్చింది.. బతుకు భారమైన వారికి అన్నం పెట్టింది. ఈ కార్యక్రమం ద్వారా పేరు తెచ్చుకున్న వారందరూ ప్రస్తుతం ఉన్నత స్థానంలో ఉన్నారు. సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు కమెడియన్లుగా రాణిస్తున్న వారిలో చాలామంది ఈ షో నుంచి వచ్చినవారే ఉన్నారు. అయితే ఇటీవల కమెడియన్ కిర్రాక్ ఆర్పీ చేసిన వ్యాఖ్యలతో అందరి దృష్టి ఈ షోపై పడింది. అసలు ఆ షో వెనుక ఏం జరుగుతోందనే చర్చ మొదలైంది.

'జబర్దస్త్' ద్వారా గుర్తింపును సంపాదించుకుని ప్రస్తుతం ఇతర కామెడీ షోలతో బిజీగా ఉన్న ఆర్టిస్ట్ లలో కిరాక్ ఆర్పీ ఒకరు. నిర్వాహకులు పంపించారా లేదా అతనే బయటకు వచ్చాడా అనేది తెలియదు కానీ.. చాలా రోజుల క్రితమే కామెడీకి దూరమయ్యాడు. అయితే రీసెంట్ గా 'జబర్దస్త్' షో గురించి.. మల్లెమాల ప్రొడక్షన్ మరియు నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి గురించి ఆర్పీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.

మల్లెమాలలో ఫుడ్ అస్సలు బాగోదని.. టీమ్ లీడర్స్ అంతా రోడ్డు పక్కన సైకిల్ మీద వచ్చి అమ్ముకునే వారి దగ్గర ఫుడ్ తింటారని.. కేజీఎఫ్ లో బానిసల్లా ట్రీట్ చేస్తారని ఆర్పీ ఆరోపించాడు. అక్కడ నటీనటులకు అస్సలు గౌరవమే ఇవ్వరని దుమ్మెత్తిపోశాడు. జబర్దస్త్ వల్ల తాము బాగుపడలేదని.. తమ వల్లే జబర్దస్త్ బాగుపడిందని విమర్శలు గుప్పించాడు. ఆ షో నుంచి తర్వాత ఎవరైనా ఇంటర్వ్యూకి వస్తే వాళ్లు జబర్దస్త్ గొప్పదని గనుక చెప్పితే తాను గుండు కొట్టించుకుంటానని వ్యాఖ్యానించాడు.

అయితే ఆర్పీ కామెంట్స్ దుమారం రేపడంతో హైపర్ ఆది మరియు ఆటో రామ్ ప్రసాద్ రంగంలోకి దిగి అతనికి కౌంటర్ ఇచ్చారు. ఆర్పీ కామెంట్లని తప్పుబడుతూ జబర్థస్త్ వల్లే అందరూ ఎదిగారని.. ఆ షో తల్లిలాంటిదని చెబుతూ మల్లెమాలకు సపోర్ట్ గా నిలబడ్డారు. శ్యామ్ ప్రసాద్ ని గౌరవం లేకుండా అలా ఏకవచనంతో సంభోదించడం కరెక్ట్ కాదని.. ఆర్పీ కామెంట్స్ చాలా బాధాకరమని.. అలా ఎందుకు మాట్లాడాడో అర్థం కాలేదన్నారు. కడుపు నిండక ముందు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే బాగుండేదని.. కడుపు నిండిన తర్వాత అలా మాట్లాడటం భావ్యం కాదని హితవు పలికారు. గతంలో జబర్దస్త్ షోని పొగుడుతూ ఆర్పీ చేసిన కామెంట్లని వీడియోల చూపించారు. అప్పుడు జబర్థస్త్ తల్లి అయినప్పుడు.. ఇప్పుడు ఎలా కాకుండా పోయిందని ప్రశ్నించారు.

ఇదే క్రమంలో మరో కమెడియన్ షేకింగ్ శేషు కూడా ఆర్పీ పై ఫైర్ అయ్యాడు. కిర్రాక్ ఆర్పీ తింగర వాగుడుతో జబర్దస్త్ షో బంద్ చేస్తే.. ఎంతోమంది ఆర్టిస్టులు రోడ్డున పడతారని అన్నారు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి మంచి వారికి మంచి వారు. చెడ్డ వారికి చెడ్డవారు. ఆయన కాంట్రవర్సీలకు దూరంగా ఉంటారు. ఆయన ఒక్కసారి నేను ఇంతమంది ఇంత చేస్తున్నది తప్పా.. నేను ఇంత దరిద్రంగా చేస్తున్నానా? అలాంటప్పుడు ఈ షో రన్ చేయడం ఎందుకు? ఇక ఆపేద్దామని ఒక్కసారి ఆయన నిర్ణయం తీసుకున్నారా? ఎన్ని కుటుంబాలు రోడ్డున పడతాయో ఆలోచించండి. వీడు వాగిన తింగర వాడుకు జబర్దస్త్ - ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలు ఆపేస్తే అందరూ ఏమై పోవాలి? అందరికీ సినిమా అవకాశాలు రావు కదా? అని శేష్ అన్నారు.

జబర్దస్త్ నా తల్లిలాంటిది.. నా వయసు రీత్యా నేను దూరంగా ఉంటున్నా. కంటెస్టెంట్ గా పిలిస్తే వెళ్లి సపోర్ట్ చేస్తా. కిర్రాక్ ఆర్పీ కావాలనే మాట్లాడుతున్నాడు. శ్యాంప్రసాద్ రెడ్డి బద్నాం చేద్దామని కామెంట్స్ చేస్తున్నాడు. ఇలా మాట్లాడే వాడిని నేను ఎక్కడా చూడలేదు అని కిర్రాక్ ఆర్పీపై షేకింగ్ శేషు విమర్శలు గుప్పించారు. అంతేకాదు కిరాక్ ఆర్పీ ఓ ప్రొడ్యూసర్ ను మోసం చేశాడని.. సినిమా తీస్తానని చెప్పి రూ.20 లక్షలు నష్టపోయేలా చేశాడని.. ఆ నిర్మాత లబోదిబోమంటూ ఫిల్మ్ చాంబర్ లో కంప్లైంట్ చేశాడని శేష్ తెలిపాడు.

ఈ నేపథ్యంలోనే కిర్రాక్ ఆర్పీ మరో ఇంటర్వ్యూతో తెరపైకి వచ్చాడు. తనని కౌంటర్ చేసిన ఆది - రామ్ ప్రసాద్ లపై విరుచుకుపడ్డాడు. తాను ఎవరికీ ఊడిగం చేయనని.. కాకా పట్టనని అన్నాడు. తనపై తీవ్ర ఆరోపణలు గుప్పించిన షేకింగ్ శేషుపై బూతులతో రెచ్చిపోయాడు ఆర్పీ. 'నేను నిర్మాతను మోసం చేశానని.. రోడ్డున పడే పరిస్థితి వచ్చేసిందంటూ షేకింగ్ శేషు మాట్లాడాడు. ఇందులో వాస్తవం ఏంటి అంటే.. ఆ సినిమా ఆగిపోయింది. నేను ప్రొడ్యూసర్ అరుణాచలం గారు మాట్లాడుకున్నాం. ఇక సినిమా స్టార్ట్ కాదనుకుని ఆపేశాం' అని చెప్పాడు.

'నేను అరుణాచలం గారికి కథ చెప్పిన తరువాత.. ఆయన ఓకే చేసిన తర్వాతే ఆఫీస్ ఓపెన్ చేశాం. నాగబాబు గారు - జేడీ చక్రవర్తి గారు నన్ను ఆశీర్వదించారు. అందరూ సంతోషపడ్డారు. అయితే మా సినిమా ఆగిపోయింది. ఇద్దరం మాట్లాడుకున్న తర్వాతనే ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసుకున్నాము. ఒకవేళ భవిష్యత్తులో ఇదే కథతో సినిమా తీయాల్సి వస్తే నేను వేరే నిర్మాతతో చేసుకుంటాను.. అప్పుడు మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను అని కూడా చెప్పాను' అని ఆర్పీ వివరణ ఇచ్చాడు. ఈ సందర్భంగా షేకింగ్ శేషు శ్యాంప్రసాద్ రెడ్డి తొత్తు అని షాకింగ్ కామెంట్స్ చేసాడు.

ఆర్పీ వ్యాఖ్యలను మరికొందరు జబర్దస్త్ కమెడియన్స్ కూడా ఖండించారు. సీనియర్ నటుడు బాబూ మోహన్ - నిర్మాత నట్టి కుమార్ - సీనియర్ డైరెక్టర్ గీతా కృష్ణ వంటి సినీ ఇండస్ట్రీకి చెందినవారు కూడా ఆర్పీ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు. ఇలా గత కొన్ని రోజులుగా 'జబర్దస్త్' షో పైనే చర్చలు జరుగుతున్నాయి. ఒకప్పుడు షోలో స్నేహమేరా జీవితం అని పాడుకున్న వారంతా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ వేదికగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. జబర్దస్త్ కు వ్యతిరేకంగా మద్దతుదారులుగా రెండు వర్గాలుగా చీలిపోయి విమర్శలు చేసుకుంటున్నారు.