Begin typing your search above and press return to search.

పవన్ కళ్యాణ్‌ ని ఇండస్ట్రీ వేరుచేసి చూస్తోందా..?

By:  Tupaki Desk   |   30 Sept 2021 2:07 PM IST
పవన్ కళ్యాణ్‌ ని ఇండస్ట్రీ వేరుచేసి చూస్తోందా..?
X
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్.. ఏపీ ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి మంత్రులపై చేసిన కామెంట్లు తీవ్ర దుమారాన్నే రేపుతున్నాయి. 'రిపబ్లిక్' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ లో పవన్ ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆవేశపూరిత ప్రసంగం చేయడంతో మొదలైన వివాదం కొనసాగుతూనే ఉంది. జనసేనానిపై మంత్రులు - వైసీపీ మద్దతుదారులు తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడగా.. సినీ నటుడు, దర్శకనిర్మాత పోసాని కృష్ణ మురళీ పదునైన విమర్శలు చేశారు. ఈ క్రమంలో పవన్ తో సహా ఫ్యామిలీ మొత్తం మీద అభ్యంతరకరమైన కామెంట్స్ చేశారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో పవన్ కు ఇండస్ట్రీ మద్దతు కరువైందని అర్థం అవుతోంది.

పవన్ కళ్యాణ్ సినిమా ఫంక్షన్ లో లేవనెత్తిన అంశాలపై ఇండస్ట్రీలో నాని - కార్తికేయ వంటి హీరోలు మద్దతు తెలుపుతూ ట్వీట్స్ చేశారు. ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పవన్ చేసిన ప్రకటనలకు సపోర్ట్ గా వీరు తప్ప టాలీవుడ్ ప్రముఖులు ఎవరూ బయటకు రాలేదు. అయితే పవన్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అంటూ అనేకమంది స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ - ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ పవన్ కామెంట్స్ తో ఇండస్ట్రీకి సంబంధం లేదని ప్రకటన విడుదల చేశారు.

'మా' అధ్యక్ష బరిలో నిలిచిన మంచు విష్ణు మరియు అతని ప్యానల్ తాము ఇండస్ట్రీ వైపు ఉంటామని.. పవన్ కళ్యాణ్ కామెంట్స్ తో ఏకీభవించమని అన్నారు. 'రిపబ్లిక్' డైరెక్టర్ దేవ కట్టా సైతం పవన్ వ్యాఖ్యలు తన వ్యక్తిగత అభిప్రాయాలని.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జనసేన అధినేత ప్రకటనలతో తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. వీటన్నింటి కంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పవన్ పెద్దన్నయ్య చిరంజీవి కూడా ఇండస్ట్రీకి అతని వ్యాఖ్యలతో సంబంధం లేదని పేర్కొనడం.

సినీ పరిశ్రమ సమస్యలపై టాలీవుడ్ నిర్మాతల భేటీ అనంతరం ఏపీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. చిరంజీవి తనకు ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేసిన విషయాన్ని వెల్లడించారు. ఆడియో ఫంక్షన్ లో జరిగిన పరిణామాలతో ఇండస్ట్రీకి సంబంధం లేదని.. తాము ఆ భావంతో లేమని చిరంజీవి చెప్పినట్లు మంత్రి స్పష్టం చేశారు. ఈ సమావేశానికి హాజరైన నిర్మాతలు కూడా పవన్ వ్యాఖ్యలతో ఇండస్ట్రీకి సంబంధం లేదని చెప్పినట్లు తెలిపారు.

'రిపబ్లిక్' ఆడియో ఫంక్షన్ లో ఉన్న దిల్ రాజు కూడా.. నిన్న మచిలీపట్నంలో మంత్రి నాని తో సమావేశం అనంతరం మీడియా ఇంటరాక్షన్‌ లో సినిమా పరిశ్రమ సమస్యలను ఎవరూ రాజకీయం చేయవద్దని అన్నారు. సినిమా టికెట్ల రేట్లను పెంచాలని.. టికెట్లు ఆన్‌ లైన్‌ విధానం కావాలని పరిశ్రమ తరపున తామే ప్రభుత్వాన్ని కోరామని దిల్ రాజు అన్నారు. గత సమావేశంలోనే చర్చించిన దీని సారంశాన్ని, సినీ పరిశ్రమకు వివరించలేకపోయామని.. అందువల్లే ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయని దిల్‌ రాజ్ చెప్పారు. ఇలా చిరంజీవి సహా సినీ పెద్దలంతా పవన్ కు వ్యతిరేకంగా ప్రభుత్వంతో కలిసి ముందుకు వెళ్తున్నారు.


ఇకపోతే పవన్ కళ్యాణ్ మీద పోసాని కృష్ణ మురళి చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలను కూడా ఎవరూ ఖండించలేదు. తమ్మారెడ్డి భరద్వాజ్ మినహా టాలీవుడ్ ప్రముఖులు దీని గురించి మాట్లాడలేదు. మెగా క్యాంప్ కూడా ఈ వ్యవహారం పై మౌనం వహిస్తోంది. ఇండస్ట్రీ కోసం ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ చేసిన పోరాటంలో ఒంటరి అయ్యాడని ఆయన అభిమానులు భావిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం ఇండస్ట్రీ సమస్యలపై సానుకూలంగా స్పందిస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ ఇలాంటి కామెంట్స్ చేయడం వల్లనే సినీ ప్రముఖులు జనసేనాని కి మద్దతు పలకడం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికపై అందరి దృష్టి ఉంది.