Begin typing your search above and press return to search.

‘మా’ ఎన్నికలు.. డిష్యుం డిష్యుం మొదలు

By:  Tupaki Desk   |   3 March 2019 12:18 PM GMT
‘మా’ ఎన్నికలు.. డిష్యుం డిష్యుం మొదలు
X
నాలుగేళ్ల కిందట మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు ఎంత రసవత్తరంగా సాగాయో గుర్తుండే ఉంటుంది. రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలోని కొత్త ప్యానెల్.. ఇండస్ట్రీలో పెద్ద తలకాయల్ని ఢీకొట్టి ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించింది. ఐతే తర్వాతి పర్యాయం ఎన్నికల విషయంలో చప్పుడే లేకపోయింది. మ్యూచువల్ అండర్ స్టాండింగ్ మీద ఎన్నికలు జరిగిపోయాయి. శివాజీ రాజా అధ్యక్షుడయ్యాడు. ఐతే ఈసారి కథ మారింది. మధ్యలో ‘మా’లో కొన్ని వివాదాలు రాజుకున్న నేపథ్యంలో మళ్లీ పోటా పోటీగా తయారైంది వ్యవహారం. ఈసారి రెండు ప్యానెళ్లు గట్టిగా సమరానికి సై అంటున్నాయి. ఇరు వర్గాలూ బలమైన అభ్యర్థులతో బరిలోకి దిగుతున్నారు. ఇంతకుముందు శివాజీ రాజా ప్యానెల్లోనే ఉన్న నరేష్.. ఈసారి ఆయనకు వ్యతిరేకంగా పోటీ చేస్తున్నారు. అధ్యక్ష పదవికి వీళ్లిద్దరి మధ్యనే పోటీ నెలకొంది.

ఆ మధ్య ఒక ఈవెంట్‌ కు సంబంధించి శివాజీ రాజా మీద నరేష్ తీవ్ర ఆరోపణలు, విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసారి ఎన్నికల ముంగిట ఆరోపణలు, ప్రత్యారోపణలు గట్టిగానే ఉంటాయని భావిస్తున్నారు. నరేష్ అధ్యక్షుడిగా ఉన్న ప్యానెల్ నుంచి జీవిత రాజశేఖర్ ప్రధాన కార్యదర్శిగా, రాజశేఖర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌ గా పోటీ చేస్తుండటం విశేషం. శివాజీ రాజా ప్యానెల్ నుంచి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌ గా శ్రీకాంత్.. ప్రధాన కార్యదర్శిగా రఘుబాబు బరిలో ఉన్నారు. ఇంకా ఆ ప్యానెల్ నుంచి ఎష్వీ కృష్ణారెడ్డి, పరుచూరి వెంకటేశ్వరరావు, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఉత్తేజ్, వేణు మాధవ్ లాంటి ప్రముఖులు వివిధ పదవులకు పోటీలో ఉన్నారు. పలుకుబడి పరంగా చూస్తే శివాజీ రాజా ప్యానెల్‌ దే పైచేయిగా కనిపిస్తోంది. మరి ఎన్నికల ముందు ఎవరు ఎలా గళం వినిపిస్తారో.. సభ్యుల్ని ఎంతమేరకు ఆకట్టుకుంటారో చూడాలి. ఈ నెల 10న మా ఎన్నికలు జరగబోతున్నాయి.