Begin typing your search above and press return to search.

సీబీసీఐడీ ప్రశ్నల వర్షంలో తడిచిన ప్రముఖ దర్శకుడు

By:  Tupaki Desk   |   28 Feb 2020 5:29 AM GMT
సీబీసీఐడీ ప్రశ్నల వర్షంలో తడిచిన ప్రముఖ దర్శకుడు
X
హడావుడి.. అంతకు మించిన సందడితో సాగుతోన్న షూటింగ్ ఒక్కసారిగా కలకలం రేగటమే కాదు.. తీవ్రమైన షాక్ కు గురయ్యేలా చేసింది భారతీయుడు -2 సెట్ లో చోటు చేసుకున్న ప్రమాదం. ఇందులో ముగ్గురు మరణించటం తెలిసిందే. ఈ ఘటన ఆ వుడ్డు.. ఈ వుడ్డు అన్న తేడా లేకుండా అందరిని ఉలిక్కిపడేలా చేసింది. ఈ ప్రమాదం కాస్త ముందుగా జరిగి ఉంటే.. చిత్ర దర్శకుడు శంకర్ తో పాటు.. ప్రముఖ హీరోయిన్ కాజల్ సైతం ప్రమాదానికి గురయ్యే వారన్న విషయం తెలిసిందే.

ఈ ఉదంతం నేపథ్యంలో చిత్ర పరిశ్రమలో పని చేసే కార్మికులకు భద్రత లేకుండా పోతుందన్న వాదన తెర మీదకు వచ్చింది. ఇదిలా ఉంటే.. షూటింగ్ లో చోటు చేసుకున్న ఈ ప్రమాదంపై తమిళనాడు ప్రభుత్వం సీబీసీఐడీ విచారణకు ఆదేశించింది.

దీంతో.. తమ పని స్టార్ట్ చేసిన సీబీసీఐడీ అధికారులు ఇప్పటికే సినిమా సెట్ మేనేజర్.. క్రేన్ యజమాని.. ఆపరేటర్లతో సహా మొత్తం ఆరుగురిని విచారించారు. తాజాగా చిత్ర దర్శకుడు శంకర్ ను ప్రశ్నించారు. అయితే.. ఈ ప్రక్రియ సుదీర్ఘంగా సాగింది. దాదాపు మూడు గంటల పాటు శంకర్ ను ప్రశ్నించిన అధికారులు త్వరలోనే చిత్ర కథానాయకుడు కమల్ హాసన్ ను సైతం ప్రశ్నించనున్నారు.

ఈ ప్రమాదానికి సంబంధించి ఇప్పటికే చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్.. క్రేన్ ఆపరేటర్ల మీద కేసులు నమోదయ్యాయి. ఓపక్క కేసులు.. మరో పక్క విచారణతో భారతీయుడు -2 టీం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. మూడు గంటల పాటు సాగిన సీబీసీఐడీ అధికారుల ప్రశ్నల వర్షంలో దర్శకుడు శంకర్ తడిచిపోయారన్న మాట వినిపిస్తోంది.