Begin typing your search above and press return to search.

అదే జరిగితే 'పుష్ప' ని పాన్ ఇండియా మూవీ అనలేం..!

By:  Tupaki Desk   |   7 Nov 2021 3:42 AM GMT
అదే జరిగితే పుష్ప ని పాన్ ఇండియా మూవీ అనలేం..!
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ''పుష్ప''. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ విలన్ గా కనిపించనున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫస్ట్ పార్ట్ ని 'పుష్ప: ది రైజ్' పేరుతో పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. డిసెంబర్ 17న రిలీజ్ అని డేట్ కూడా ఇచ్చేశారు. అయితే ఇప్పుడు హిందీ వెర్సన్ థియేట్రికల్ రిలీజ్ విషయంలో ఇబ్బందులు తలెత్తాయని టాక్ వినిపిస్తోంది.

"పుష్ప" చిత్రాన్ని పాన్ ఇండియన్ ప్రాజెక్ట్‌ గా.. రెండు భాగాలుగా ప్లాన్ చేయక ముందే మేకర్స్ హిందీ డబ్బింగ్ రైట్స్‌ ని ఓ డిస్ట్రిబ్యూటర్‌ కి విక్రయించారట. అయితే సదరు పంపిణీదారుడు ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేయడానికి సుముఖంగా లేరట. ఈ విషయమై మైత్రీ మేకర్స్ అక్కడి వారితో చర్చలు జరుపుతున్నారట. అయితే ఇటీవల మేకర్స్ మరియు హిందీ పంపిణీదారు మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయని.. వారు మొండిగా వ్యవహరిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే హిందీ మార్కెట్‌ లో అల్లు అర్జున్ సినిమా థియేటర్లలో విడుదల కాకపోవచ్చని అంటున్నారు. ఇదే జరిగితే 'పుష్ప' పాన్ సౌత్ ఇండియన్ సినిమా మాత్రమే అవుతుంది.

బాలీవుడ్‌ లో అల్లు అర్జున్‌ చిత్రాలకు విపరీతమైన క్రేజ్‌ ఉంది. బన్నీ నటించిన ఒక్క సినిమా కూడా డైరెక్ట్ గా హిందీలో విడుదల కాకపోయినా.. ప్రతీ చిత్రం హిందీలో డబ్ కాబడి యూట్యూబ్‌ లో మిలియన్ల కొద్దీ వ్యూస్‌ దక్కించుకుంటుంది. అందుకే 'పుష్ప' చిత్రాన్ని భారీ స్థాయిలో పాన్‌ ఇండియా మూవీగా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. ఇప్పుడేమో హిందీ మార్కెట్ విషయంలో పరిస్థితులన్నీ తలకిందులు అయ్యాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్‌ ని ఒప్పించేందుకు బన్నీతో పాటుగా అల్లు అరవింద్‌ కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. దీనిపై త్వరలోనే స్పష్టత వస్తుందేమో చూడాలి.

ఇకపోతే 'పుష్ప' నుంచి ఇటీవల 'సామీ సామీ' అనే మాస్ సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. నాలుగు దక్షిణాది భాషల్లోనే ఈ పాటను అందుబాటులోకి తీసుకొచ్చారు. హిందీ వెర్సన్ ని మాత్రం వదలలేదు. ప్రస్తుతం ఈ సినిమాలోని చివరి పాట షూటింగ్ జరుగుతోంది. హైదరాబాద్ లో సుమారు 1000 మందికి పైగా డ్యాన్సర్లతో ఈ సాంగ్ ని షూట్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని - వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.