Begin typing your search above and press return to search.

అదే జరిగితే సినిమాలు మానేస్తా : సురేష్‌ బాబు

By:  Tupaki Desk   |   22 July 2021 8:11 AM GMT
అదే జరిగితే సినిమాలు మానేస్తా : సురేష్‌ బాబు
X
టాలీవుడ్ లెజెండ్రీ నిర్మాత డా. డి రామానాయుడు తనయుడు సురేష్‌ బాబు నిర్మాతగా సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్నారు. తండ్రి అడుగు జాడల్లో నిర్మాతగా మారిన సురేష్ బాబు టాలీవుడ్ కు సరికొత్త పద్దతులు పరిచయం చేశాడు. ఆయన కేవలం నిర్మాతగా మాత్రమే కాకుండా డిస్ట్రిబ్యూటర్ గా.. ఎగ్జిబ్యూటర్‌ గా స్టూడియో అధినేతగా సినిమా సమర్పకుడిగా ఎన్నో రకాలుగా కొనసాగుతూ వస్తున్నారు. పెద్ద సినిమాలు చిన్న సినిమాలు ఏమైనా కూడా నిర్మాతలు డైరెక్ట్‌ గా రిలీజ్ చేసుకోవాలంటే సురేష్‌ బాబును ఆశ్రయించాల్సిందే. సురేష్‌ బాబు ఇండస్ట్రీలో పెద్ద దిక్కు అనడంలో సందేహం లేదు.

సురేష్‌ బాబు ఇండస్ట్రీలో అడుగు పెట్టి దాదాపుగా అయిదు దశాబ్దాలు అయ్యింది. సురేష్‌ ప్రొడక్షన్స్ లో వస్తున్న మార్పులను ఆయన చిన్నప్పటి నుండి చూస్తూ వస్తున్నాడు. ఆయన సురేష్‌ ప్రొడక్షన్స్‌ ను తండ్రి తరహాలోనే ఒక బ్రాండ్ గా మార్చారు. సురేష్ ప్రొడక్షన్స్‌ వారి బ్యానర్ లో సినిమా అంటే ఖచ్చితంగా సినిమా బాగుంటుందనే ఒక అభిప్రాయం జనాలకు కలిగేలా మంచి కంటెంట్‌ ఉన్న సినిమాలను నిర్మించడంతో పాటు ఇతర హీరోలు నిర్మించిన చిన్న సినిమాలను కూడా చూసి మంచి కంటెంట్‌ అయితే సమర్పించేందుకు ముందుకు వచ్చాడు. కొన్ని వందల సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన సురేష్ బాబు ఆరు పదుల వయసు దాటినా కూడా ఇంకా చాలా జోష్‌ గానే సినిమాలు నిర్మిస్తున్నాడు.

ఈమద్య కాలంలో ఇతర నిర్మాతల భాగస్వామ్యంలో ఎక్కువగా సినిమాలను విడుదల చేస్తున్న సురేష్‌ బాబు తాజాగా నారప్ప సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. తమిళ నిర్మాత కళై పులి ఎస్‌ థాను తో కలిసి నిర్మించాడు. నారప్ప సినిమా షూటింగ్ ను పూర్తి చేసి చాలా రోజులు అయినా కూడా కరోనా కారణంగా ఇన్నాళ్లు వెయిట్‌ చేసి చివరకు ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ఇక ఈ సినిమా ఓటీటీ లో విడుదల విషయంలో ఆయనపై విమర్శలు వచ్చాయి. వాటికి తనదైన శైలిలో సున్నితంగా సమాధానం చెప్పాడు. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తాను ఎప్పటి వరకు సినిమాలు చేసే విషయమై క్లారిటీ ఇచ్చాడు.

ప్రేక్షకుల అభిరుచిని ఎప్పటి వరకు నేను అర్థం చేసుకోగలనో అప్పటి వరకు సినిమాలు చేస్తూనే ఉంటాను. నేను చేస్తున్న సినిమాలు ప్రేక్షకులకు నచ్చే వరకు నేను సినిమాలు నిర్మించడంతో పాటు నా సినిమాల పట్ల ప్రేక్షకులు ఆసక్తి కనబర్చేంత వరకు నేను సినిమాలను నిర్మిస్తాను అంటూ సురేష్‌ బాబు పేర్కొన్నాడు. 2021 లో నేను నిర్మించిన సినిమాల పట్ల ప్రేక్షకులు ఇంకా ఆసక్తి చూపిస్తున్నారు కనుక నేను ఇంకా కొంత కాలం సినిమాలను నిర్మించవచ్చు అన్నట్లుగా భావిస్తున్నాను అంటూ సురేష్‌ బాబు చెప్పుకొచ్చారు.

సురేష్ బాబు ఫ్యామిలీ నుండి నిర్మాతగా ఆయన వారసత్వంను ఎవరు తీసుకుంటారు అనేది క్లారిటీ లేదు. ఆయన ఇద్దరు తనయులు రానా మరియు అభిరామ్‌ లు హీరోలుగా చేస్తున్నారు. ఇప్పటికే రానా టాలీవుడ్‌ లో టాప్‌ స్టార్‌ గా నిలవగా.. అభిరామ్‌ హీరోగా నటించేందుకు సిద్దం అయ్యాడు. సురేష్‌ బాబు తన అభిరుచిని ట్రెండ్‌ కు తగ్గట్లుగా మార్చుకుంటూ సినిమాలు చేస్తూ ఇంకా చాలా కాలం పాటు టాలీవుడ్‌ లో కొనసాగాలని సినీ అభిమానుల కోరిక. సురేష్‌ బాబు నుండి ముందు ముందు మరిన్ని సినిమాలు వస్తాయని ఆశిద్దాం.