Begin typing your search above and press return to search.

5జీ కేసు విచారణ: జూహీ చావ్లాను చూసి పాటలు పాడిన వ్యక్తిపై హైకోర్ట్ జడ్జి సీరియస్..!

By:  Tupaki Desk   |   3 Jun 2021 4:30 AM GMT
5జీ కేసు విచారణ: జూహీ చావ్లాను చూసి పాటలు పాడిన వ్యక్తిపై హైకోర్ట్ జడ్జి సీరియస్..!
X
బాలీవుడ్ నటి జూహీ చావ్లా దేశంలో 5జీ నెట్ వర్క్ ట్రయల్స్ జరపొద్దంటూ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. 5జీ నెట్‌ వ‌ర్క్ ప‌ర్యావ‌రణంతో పాటుగా మ‌నుషుల‌పై తీవ్ర ప్రభావం చూపిస్తుందని.. అందుకే ట్రయల్స్ ఆపాల‌ని కోర్టుని కోరింది. 5జీ నెట్ వర్క్ నుంచి విడుదలయ్యే రేడియేషన్ వలన ప్రజలకు, పక్షులకు, జంతువులకు ప్రాణహాని జరుగుతుందని.. వారికి నష్టపరిహారం చెల్లించే బాధ్యత టెలికామ్ సంస్థలదే అని ఢిల్లీ హైకోర్టుకు ఫిర్యాదు చేశారు జూహీ చావ్లా. దీనిపై బుధవారం ఢిల్లీ హైకోర్టు వర్చువల్ విచారణ ప్రారంభించింది. ఈ సందర్భంగా దీనికి హాజరైన జూహీ చావ్లాను చూసి ఓ వ్యక్తి పాటలు పాడగా.. దీనిపై జడ్జి సీరియస్ అయినట్లు తెలుస్తోంది.

వర్చువల్ విచారణలో జూహీ చావ్లాని చూసిన ఓ వ్యక్తి ఆమె నటించిన సినిమాల్లోని పాటలు పాడడం మొదలుపెట్టాడు. ముందుగా 'ఘూంగ‌ట్ కి ఆద్ సే' పాట పాడి మీటింగ్ నుంచి వెళ్ళిపోయాడు. కాసేపటికి మళ్లీ వచ్చిన అతను ఈసారి 'లాల్ లాల్ హోటోంపే' పాటని హమ్ చేశాడు. ఆ తర్వాత మీటింగ్‌ లో నుంచి వెళ్లిపోయి మ‌ళ్లీ వచ్చి 'మేరీ బ‌న్నో కీ ఆయేగీ బారాత్' అంటూ మ‌రో పాటను పాడాడు. అతని కారణంగా అంతరాయం కలగడంతో కాసేపు విచారణను నిలిపివేశారు. ఈ నేపథ్యంలో దీనిపై సీరియస్ అయిన జడ్జి.. సెషన్ నుండి అతణ్ణి తొలగించిన తరువాత తిరిగి విచారణ ప్రారంభమైంది.

అయితే ఢిల్లీ హైకోర్టు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి అతనికి ధిక్కార నోటీసు ఇచ్చింది. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇకపోతే కోర్టు వర్చువల్ హియరింగ్ గురించి జూహీ చావ్లా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. "హమ్... తుమ్ 5జీ! ఇది మీకు ఏమైనా ఆందోళన కలిగిస్తుందని మీరు అనుకుంటే ఢిల్లీ హైకోర్టులో జూన్ 2న 10.45 ఉదయం నిర్వహించే మా మొదటి వర్చువల్ హియరింగ్‌ లో చేరడానికి సంకోచించకండి" అంటూ జూహీ లింక్ పోస్ట్ చేసింది.