Begin typing your search above and press return to search.

కేజీఎఫ్ హీరోకు కొత్త తలనొప్పి

By:  Tupaki Desk   |   11 Jun 2019 8:25 AM GMT
కేజీఎఫ్ హీరోకు కొత్త తలనొప్పి
X
‘కేజీఎఫ్’ సినిమాతో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించిన హీరో యశ్. అంతకుముందు వరకు కన్నడలో అతను మీడియం రేంజి హీరో. కానీ ఈ సినిమాతో ఒక్కసారిగా సూపర్ స్టార్ స్టేటస్ సంపాదించాడు. కన్నడలో పెద్ద పెద్ద స్టార్లను దాటి ఎదిగిపోయాడు. ప్రస్తుతం అతను నటిస్తున్న ‘కేజీఎఫ్’ రెండో ఛాప్టర్ మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో తెలిసిందే. ఐతే కేజీఎఫ్ సినీ కెరీర్ ఇలా ఉంటే.. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన తలనొప్పులు అతడిని వెంటాడుతున్నాయి. ఆ మధ్య యశ్ హత్యకు కుట్ర జరుగుతోందంటూ జరిగిన ఓ ప్రచారం కలకలం రేపిన సంగతి తెలిసిందే. అలాగే అతడి ఇంటిపై ఆదాయపు పన్ను అధికారులు దాడులు చేయడం కూడా చర్చనీయాంశమైంది. ఇప్పుడు తన తల్లి కారణంగా అతను మరోసారి వార్తల్లో నిలిచాడు.

‘కేజీఎఫ్’తో కోట్ల రూపాయలు సంపాదించాడు కేజీఎఫ్. అంతకుముందు కూడా అతడు కోట్లల్లో పారితోషకం అందుకున్నవాడే. అలాంటిది యశ్ తల్లి బెంగళూరులో తాను అద్దెకు ఉంటున్న ఇంటికి 11 నెలల పాటు అద్దె చెల్లించకపోవడం ఆశ్చర్యం కలిగించింది. దీనిపై ఆ ఇంటి యజమాని కోర్టుకు కూడా వెళ్లాడు. యశ్ కుటుంబం 2010లో రూ.40 వేల చొప్పున అద్దె చెల్లించేలా ఒప్పందం చేసుకుని ఆ ఇంటికి వచ్చింది. ఇప్పుడా ఇంటి అద్దె ఐదు రెట్లు అయింది. ఐతే గత ఏడాది ఈ ఇంటికి అద్దె చెల్లించట్లేదంటూ యజమానికి కోర్టుకు ఎక్కాడు. కోర్టు యశ్ తల్లికి మొట్టికాయలు వేస్తూ ఒకేసారి రూ.23 లక్షలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు యశ్ కుటుంబం నుంచి ఇంటి యజమానికి డీడీ కూడా ఇప్పించింది. యశ్ కొన్నేళ్ల కిందటే ఈ ఇంటి నుంచి కొత్త ఇంటికి వెళ్లిపోయాడు. కానీ అతడి తల్లి మాత్రం ఆ ఇంట్లోనే ఉంటూ వస్తోంది. చివరికి ఆమెను ఆ ఇంటి నుంచి సాగనంపారు. ఐతే తాజాగా ఆ ఇంటి యజమాని మళ్లీ పోలీసుల్ని ఆశ్రయించారు. యశ్ తల్లి ఇంటిని ధ్వంసం చేసి ఇచ్చిందని.. తనకు చాలా కష్టం చేసిందని.. చర్యలు చేపట్టాలని అతను కోరాడు. దీంతో యశ్ పేరు మరోసారి మీడియాలో హైలైట్ అవుతోంది.