Begin typing your search above and press return to search.

నేడు పోలీస్ స్టేషన్ కు హీరో నాగశౌర్య తండ్రి

By:  Tupaki Desk   |   3 Nov 2021 5:34 AM GMT
నేడు పోలీస్ స్టేషన్ కు హీరో నాగశౌర్య తండ్రి
X
హైదరాబాద్ నగర శివారులోని మంచిరేవుల ప్రాంతంలో టాలీవుడ్ యువ హీరో నాగశౌర్య ఫాంహౌస్ లో పేకాట ఆడుతూ 30 మంది అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో 29మందికి ఉప్పర్ పల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రధాన నిందితుడు గుత్తా సుమన్ కు మాత్రం బెయిల్ నిరాకరించింది.

రెండు రోజుల క్రితం మంచిరేవులలో పేకాట శిబిరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఇందులో 30 మంది పేకాట ఆడుతూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. నార్సింగి పోలీసులు వీరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ప్రధాన నిందితుడు గుత్తా సుమన్ పై గతంలోనూ పలు పీఎస్ లలో కేసులు నమోదయ్యాయి. గచ్చిబౌలి, పంజాగుట్ట, కూకట్ పల్లి పీఎస్ లలో ఇతడి పేరుపై కేసులున్నాయి.

మంచిరేవుల ఫామ్ హౌస్ పేకాట కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మురం చేశారు. ఈ కేసులో నేడు పోలీస్ స్టేషన్ కు హీరో నాగశౌర్య తండ్రి రవీంద్రప్రసాద్ రానున్నారు. ఫామ్ హౌస్ రెంటల్ అగ్రిమెంట్లు తీసుకురావాలని పోలీసులు ఆయనను ఆదేశించారు. ఇప్పటికే ప్రధాన నిందితుడు సుమన్ ను 2 రోజుల కస్టడీకి అప్పగిస్తూ ఉప్పరపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నేడు, రేపు గుత్తాసుమన్ ను నార్సింగ్ పోలీసులు ప్రశ్నించారు.

హైదరాబాద్ శివారులోని హీరో నాగశౌర్య ఫాంహోస్ లో పేకాట శిబిరంపై పోలీసులు చేసిన మెరుపుదాడిలో సంచలనాలు వెలుగుచూస్తున్నాయి. ఈ వ్యవహారం ప్రకంపనలు రేపుతోంది. లక్షలు కుమ్మరించి పేకాట ఆడుతున్న బడా నేతలు, సెలబ్రెటీలు ఇందులో బుక్కైనట్టుగా చెబుతున్నారు. ఈ కేసులో పోలీసుల విచారణలో హీరో నాగశౌర్య బాబాయ్ పేరు బయటకు వచ్చింది. జూదం నిర్వహిస్తున్న గుత్తా సుమన్ తోపాటు మరికొందరిని పోలీసులు విచారిస్తున్నారు.

అరెస్ట్ సమయంలో ఇక్కడ సౌకర్యాలు చూసి పోలీసులే కంగుతిన్నారు. క్యాసినోను తలపించే రేంజ్ లో బిజినెస్ ఇక్కడ జరుగుతోంది. స్వైపింగ్ మిషీన్లు ఉన్నాయని తేలింది. చిప్స్ తో ఆట నిర్వహణ జరుగుతోంది. 6 లక్షల క్యాష్ , స్వైపింగ్ మిషన్లు, కార్లు సీజ్ చేశారు. ఇది నాగశౌర్య సొంత ఇల్లు కూడా కాదు.. ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నుంచి ఐదేళ్ల పాటు లీజుకు తీసుకున్నాడని తెలుస్తోంది.

హైదరాబాద్ లో పలు చోట్ల ఫాంహౌస్ లను అద్దెకు తీసుకొని సుమన్ క్యాసినో ఆడిస్తున్నట్టు గుర్తించారు. సుమన్ ఘరానా కేటుగాడిగా పేరుంది. గారడీ చేసి జనాన్ని ముంచేస్తాడన్న ప్రచారం ఉంది. ఫాంహౌస్ లో పేకాట నాగశౌర్య తండ్రికి తెలిసే జరుగుతుందా? అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

నాగశౌర్య తండ్రి పేరు మీద ఈ ఫాంహౌస్ ఉంది. ప్రస్తుతం పోలీసులు ఆయనను విచారిస్తున్నారు . ఇదివరకు గుత్తా సుమన్ విజయవాడలోని మామిడితోటల్లో పేకాట శిబిరాలతో పాపులర్ అయ్యాడు. అనంతరం రియల్ ఎస్టేట్ అవతారం ఎత్తాడు.