Begin typing your search above and press return to search.

వాలెంటైన్స్ మాసంలో 'గుర్తుందా శీతాకాలం'..!

By:  Tupaki Desk   |   13 Dec 2021 6:37 AM GMT
వాలెంటైన్స్ మాసంలో గుర్తుందా శీతాకాలం..!
X
అగ్ర కథానాయిక, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా - టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ''గుర్తుందా శీతాకాలం''. నాగశేఖర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మేఘా ఆకాష్ - కావ్య శెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇది కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన 'లవ్ మాక్ టైల్' చిత్రానికి అధికారిక తెలుగు రీమేక్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనింగ్ సినిమా విడుదలను తాజాగా మేకర్స్ ఖరారు చేశారు.

''గుర్తుందా శీతాకాలం'' చిత్రాన్ని 2022 ఫిబ్రవరి నెలలో విడుదల చేయనున్నట్లు సోమవారం ప్రకటించారు. తేదీని వెల్లడించనప్పటికీ.. రాబోయే వాలెంటైన్స్ మంత్ లో దేవ్ & నిధితో ప్రేమలో పడండి అని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఓ సరికొత్త పోస్టర్ ని ఆవిష్కరించారు. ఇందులో సత్యదేవ్ కౌగిలిలో తమన్నా ఒదిగిపోయి ఉంది. ఇద్దరూ చిరునవ్వుతో ఒకరి ప్రేమను మరొకరు ఆస్వాదిస్తున్న ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది.

నిజానికి 'గుర్తుందా శీతాకాలం' సినిమాని పోయిన ఏప్రిల్ లోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ కరోనా సెకండ్ వేవ్ పాండమిక్ నేపథ్యంలో వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు పరిస్థితులు సానుకూలంగా ఉండటంతో వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. త్వరలోనే డేట్ ని కూడా అనౌన్స్ చేయనున్నారు.

కాగా, ప్ర‌తీ ఒక్క‌రు త‌మ జీవితంలో టీనేజ్ - కాలేజ్ డేస్ ని..ఆ తర్వాత వ‌చ్చే యూత్ లైఫ్‌ ని ఎప్పటికీ మర్చిపోరు. ఇప్పుడు 'గుర్తుందా శీతాకాలం' సినిమా ద్వారా జీవితాంతం గుర్తుకు వచ్చే అలాంటి ఆహ్లాద‌క‌ర‌మైన సంఘ‌ట‌నలను ప్రేక్ష‌కుల‌కి గుర్తు చేయబోతున్నారు.

కెరీర్ లో ఎన్నో పాత్రల్లో మెప్పించిన తమన్నాకి నిధి క్యారెక్టర్ మంచి పేరు తెచ్చిపెడుతుందని నమ్మకంగా ఉన్నారు. సత్యదేవ్ మరో సక్సెస్ ని అందుకుంటారని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

'గుర్తుందా శీతాకాలం' చిత్రాన్ని నాగ‌శేఖ‌ర్ మూవీస్ - శ్రీ వేదాక్షర మూవీస్ - మణికంఠ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై రూపొందిస్తున్నారు. చిన బాబు - ఎంఎస్ రెడ్డి సమర్పణలో భావ‌న‌ ర‌వి - నాగశేఖర్ - రామారావు చింతపల్లి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

యువ సంగీత దర్శకుడు కాలభైరవ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి లక్ష్మీభూపాల్ సంభాషణలు రాశారు. సత్యా హెగ్డే సినిమాటోగ్రఫీ అందించగా.. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.

ఇకపోతే 'గుర్తుందా శీతాకాలం' తో పాటుగా తమన్నా హీరోయిన్ గా నటించిన 'ఎఫ్ 3' మూవీ ఫిబ్రవరి నెలలో విడుదల కానుంది. అలానే సత్యదేవ్ హీరోగా చేసిన 'గాడ్సే' సినిమా రిపబ్లిక్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.