Begin typing your search above and press return to search.

ఏపీలో సీజ్ చేయబడిన థియేటర్లకు ఊరట..!

By:  Tupaki Desk   |   30 Dec 2021 4:01 PM IST
ఏపీలో సీజ్ చేయబడిన థియేటర్లకు ఊరట..!
X
ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల థియేటర్లపై తనిఖీలు జరిగిన సంగతి తెలిసిందే. నిబంధనలు పాటించడం లేదంటూ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా పలు సినిమా హాళ్లను సీజ్ చేశారు. అయితే థియేటర్ల యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. థియేటర్లను తిరిగి ఓపెన్ చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది.

ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని ఈ విషయంపై స్పందిస్తూ.. నెలరోజులు గడువుతో నిబంధనలు పాటించే అవకాశం ఇచ్చామని తెలిపారు. దీని కోసం జిల్లా జాయింట్ కలెక్టర్ (జేసీ) కి దరఖాస్తు చేసుకోవాలని పేర్ని నాని సూచించారు. దీంతో రాష్ట్రంలోని 9 జిల్లాల పరిధిలో సీజ్ చేసిన 83 థియేటర్లను తెరుచుకునేందుకు అనుమతి లభించినట్లైంది.

ఇకపోతే గురువారం ఉదయం థియేటర్ యజమానులు మచిలీపట్నంలో మంత్రి పేర్ని నాని ని కలిశారు. ఈ నేపథ్యంలో అధికారులు గుర్తించిన లోపాలను థియేటర్ల యజమానులు సరిదిద్దుకోవాలని సూచిస్తూ.. సినిమా హాళ్లు తెరిచేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

అలానే సినీ నటుడు, దర్శక నిర్మాత ఆర్.నారాయణమూర్తి కూడా మంత్రి నానితో భేటీ అయ్యారు. ఇటీవల ఆర్ నారాయణ మూర్తి ప్రభుత్వంతో మాట్లాడి థియేటర్ల సమస్యను పరిష్కరించుకోవాలని ఎగ్జిబిటర్స్ ను కోరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు నారాయణమూర్తి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే కొన్ని విషయాలు పర్సనల్ గా అడిగి తెలుసుకునేందుకే మంత్రి వద్దకు వచ్చినట్లు ఆర్ నారాయణమూర్తి తెలిపారు.