Begin typing your search above and press return to search.

కన్నడలో మాత్రమే సినిమాలు తీస్తానని ప్రకటించిన డైరెక్టర్...?

By:  Tupaki Desk   |   22 May 2020 8:10 AM GMT
కన్నడలో మాత్రమే సినిమాలు తీస్తానని ప్రకటించిన డైరెక్టర్...?
X
‘బాహుబలి’ సినిమా తర్వాత సౌత్ ఇండస్ట్రీ నుండి పాన్ ఇండియా స్థాయిలో మెప్పించిన సినిమా ‘కేజీఎఫ్‌’. ఈ సినిమాతో దర్శకుడు ప్రశాంత్ నీల్ కి దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. పదుల సంఖ్యలో సినిమాలు చేసిన అనుభవం అయితే లేదు గానీ మాస్ ప్రేక్షకులను ఎలా కట్టిపడేయాలన్న కిటుకు మాత్రం తెలుసు. తన మాయాజాలంతో దేశం మొత్తాన్ని మంత్ర ముగ్దుల్ని చేసేశాడు. హీరోయిజమ్ చూపించడంలో.. హీరో ఎలివేషన్ సీన్స్ తెరకెక్కించాలన్నా ప్రశాంత్ కి సాటిలేరు అని 'కేజీఎఫ్' సినిమాతో నిరూపించుకున్నాడు. ఈ సినిమాతో మన టాలీవుడ్ స్టార్ హీరోల చూపు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పై పడింది. అయితే ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ‘కేజీఎఫ్ 2’ సినిమా పనులతో బిజీగా ఉన్నాడు. అయితే తన నెక్స్ట్ సినిమా తెలుగులోనే ఉండబోతోందని వార్తలు ఊపందుకున్నాయి. దీనికి తగ్గట్టు ఇప్పటికే ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నెక్స్ట్ సినిమా కోసం ప్రశాంత్ తో ఒప్పందం చేసుకుందని సమాచారం. కాగా మొన్న తారక్ బర్త్ డే సందర్భంగా ప్రశాంత్ నీల్ చేసిన ట్వీట్ తన నెక్స్ట్ సినిమా గురించి హింట్ అని తెలుస్తోంది.

''ఓ న్యూక్లియర్ ప్లాంట్ పక్కన కూర్చుంటే ఎలా ఉంటుందో ఎట్టకేలకు నేను తెలుసుకున్నాను. మళ్లీ కలిసేటపుడు చుట్టూ ఉన్న ఎనర్జీ నుంచి కాపాడుకోవడానికి రేడియేషన్ సూట్ తెచ్చుకుంటాను. హ్యాపీ బర్త్‌ డే బ్రదర్ తారక్. త్వరలోనే కలుద్దాం'' అంటూ ప్రశాంత్ నీల్ ట్వీట్ చేశాడు. సో తన ట్వీట్ ద్వారా ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ మూవీ కన్ఫర్మ్ చేసేసారు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ ఖుషీ గా ఉన్నారు. అయితే కన్నడ సినీ అభిమానులకు మాత్రం ఈ విషయం నచ్చడం లేదు. అందుకే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పై కన్నడ ప్రేక్షకులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. గెట్ లాస్ట్ ప్రశాంత్ నీల్ అనే యాష్ ట్యాగ్ తో ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు. కన్నడ పరిశ్రమకు చెందిన హీరోతో కాకుండా బయట ఇండస్ట్రీ హీరోతో ప్రశాంత్ నీల్ మూవీ చేయడం వారికి నచ్చడం లేదు. దీని కారణంగా ఒకప్పుడు పొగిడిన నోళ్లే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ని విమర్శిస్తున్నాయి. రాజమౌళి - శంకర్ లాంటి దర్శకులు తమ చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ వారు తన సొంత ఇండస్ట్రీలలోనే సినిమాలు తీస్తూ వారి ఇండస్ట్రీకి పేరు తెస్తున్నారు. కానీ ప్రశాంత్ నీల్ డబ్బుల కోసం కన్నడ ఇండస్ట్రీని పక్కన పెట్టి ఇతర ఇండస్ట్రీలలో సినిమాలు తీయడానికి సిద్దమవుతున్నాడు అంటూ విమర్శిస్తున్నారు.

ఇదిలా ఉండగా ప్రశాంత్ నీల్ దీనిపై ఒక ఇంటర్వ్యూలో స్పందించాడట. ఈ సందర్భంగా ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ.. నాకు ఇంత పేరు రావడానికి కారణం కన్నడ ఇండస్ట్రీ, కన్నడ ప్రజలు. నా డీ.ఎన్‌.ఏ లోనే కన్నడ ఉంది. ఇప్పటికిప్పుడు నా తదుపరి ప్రాజెక్ట్ గురించి చెప్పలేను. ఎందుకుంటే నా ఫోకస్ అంతా 'కేజీఎఫ్‌' చాప్టర్2 పైనే ఉంది. కానీ ఒక్కటి చెప్పగలను.. నా తదుపరి చిత్రాలన్నీ కన్నడలోనే ఉంటాయని చెప్పుకొచ్చాడట. ఈ స్టేట్మెంట్ కన్నడీగులకు సంతోషాన్ని కలిగించినా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని మాత్రం డైలమాలో పడేసింది. ఎన్టీఆర్ కాంబోలో ప్రశాంత్ చిత్రం వట్టి రూమర్స్‌గానే మిగిలిపోతాయా అనే డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు. అయితే కన్నడ - తెలుగులో ద్విభాషా చిత్రంగా చేయవచ్చని మరికొంత మంది కామెంట్ చేస్తున్నారు. మరి ఎన్టీఆర్ - ప్రశాంత్ కాంబోలో సినిమా ఉంటుందా లేదా అనే విషయంపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.