Begin typing your search above and press return to search.

వైర‌స్ కంటే మ‌న భ‌యమే మ‌న‌ల్ని ముందుగా చంపేస్తోంది!- చిరంజీవి

By:  Tupaki Desk   |   14 May 2021 4:05 PM IST
వైర‌స్ కంటే మ‌న భ‌యమే మ‌న‌ల్ని ముందుగా చంపేస్తోంది!- చిరంజీవి
X
క‌రోనా క్రైసిస్ కాలంలో సీసీసీని ప్రారంభించి ప‌రిశ్ర‌మ కార్మికుల‌కు ఎంతో సేవ చేశారు మెగాస్టార్ చిరంజీవి. సెకండ్ వేవ్ స‌మ‌యంలోనూ కార్మికుల‌కు వ్యాక్సినేష‌న్ చేయిస్తున్నారు. ప్లాస్మా దానం ర‌క్త‌దానంపైనా ప్ర‌జ‌ల్ని అభ్య‌ర్థిస్తున్నారు. కోవిడ్ రోగుల‌కు స‌కాలంలో సాయం కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప‌లువురు అభిమానుల‌కు ఆస్ప‌త్రుల్లో బెడ్స్ కోసం సాయ‌ప‌డ్డారు. తాజాగా క‌రోనా సెకండ్ వేవ్ తీవ్ర‌త‌పై మెగాస్టార్ స్ఫూర్తివంత‌మైన స్పీచ్ ని ఇచ్చారు. ప్ర‌స్తుతం ఆ వీడియో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.

మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. క‌రోనా సెకండ్ వేవ్ చాలా ప్ర‌మాద‌క‌రంగా ఉంది. చాలామంది వైర‌స్ బారిన ప‌డి ప్రాణాలతో పోరాడుతున్నారు. కోలుకోవ‌డానికి చాలా స‌మ‌యం ప‌డుతోంది. వైర‌స్ వ‌ల్ల‌ మ‌న ఆత్మీయుల్ని కోల్పోతున్నామంటే గుండె త‌రుక్కుపోతోంది. ఈ త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల్లో మ‌ళ్లీ లాక్ డౌన్ వేశారు. క‌నీసం ఇప్పుడైనా అల‌క్ష్యం చేయ‌కుండా ఉండండి.. ఇంటి నుంచి బ‌య‌ట‌కు రావొద్దు. లాక్ డౌన్‌ స‌మ‌యంలో బ‌య‌ట‌కు వ‌చ్చినా మాస్క్ ధ‌రించండి. వీలైతే డ‌బుల్ మాస్క్ ధ‌రించండి.

లాక్ డౌన్ లో కూడా వ్యాక్సినేష‌న్ సాగుతోంది. రిజిస్ట్రేష‌న్ చేసుకుని అంద‌రూ వ్యాక్సినేష‌న్ తీస్కోండి. ఆ త‌ర్వాత క‌రోనా పాజిటివ్ వ‌చ్చినా ప్ర‌భావం త‌క్కువ‌. కోవిడ్ పాజిటివ్ వ‌చ్చినా ప్యానిక్ అవ్వ‌కండి. వైర‌స్ కంటే మ‌న భ‌యమే మ‌న‌ల్ని ముందుగా చంపేస్తోంది.

క‌రోనా పాజిటివ్ అని తెలియానే ఐసోలేష‌న్ కి వెళ్లండి. మిమ్మ‌ల్ని మీరు వేరు చేసుకోండి. డాక్ట‌ర్ ని సంప్రదించండి. మందులు వాడండి. ఊపిరి స‌మ‌స్య త‌లెత్తితే వెంట‌నే ఆస్ప‌త్రిలో చేరండి..

క‌రోనా చికిత్స పొందిన త‌ర్వాత నెల‌రోజుల్లో యాంటీబాడీస్ త‌యార‌వుతాయి. మీరు ప్లాస్మా దానం చేస్తే ఒక్కొక్క‌రు మ‌రో ఇద్ద‌రిని కాపాడిన వారు అవుతారు. ఈ విప‌త్తు స‌మ‌యంలో వీలైనంత మందికి ఈ విష‌యం చెప్పండి. మ‌న‌ల్ని మ‌నం కాపాడుకుంటే దేశాన్ని ర‌క్షించిన వాళ్లం అవుతాం. అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుని సుర‌క్షితంగా ఉండండి. జైహింద్.. అని చిరు సుదీర్ఘ స్పీచ్ లో తెలిపారు.