Begin typing your search above and press return to search.

జాను: పోలికలు తప్పవు.. ట్రోల్స్ తప్పవు!

By:  Tupaki Desk   |   4 Feb 2020 5:09 AM GMT
జాను: పోలికలు తప్పవు.. ట్రోల్స్ తప్పవు!
X
రీమేక్ సినిమాలను ఎంచుకోవడం సక్సెస్ కు ఓ షార్ట్ కట్ అని చాలామంది మేకర్స్ నమ్ముతారు. అయితే కొందరు మాత్రం రీమేక్ సినిమాలకు దూరంగా ఉంటారు. సీనియర్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మొదటి నుంచి రీమేక్ లకు దూరంగా ఉండే వ్యక్తి. అలాంటిది ఆయన మొదటిసారి రెండు సినిమాలను రీమేక్ చేస్తున్నారు. అందులో ఒకటి '96' రీమేక్.. రెండవది 'పింక్' రీమేక్. రాజుగారు తన రీమేక్ సినిమాల ఛాయిస్ పై నమ్మకంగా ఉన్నారు కానీ '96' రీమేక్ సినిమా 'జాను' కు మాత్రం ఇప్పటివరకూ బజ్ రాలేదు. నిజం చెప్పుకుంటే.. ఈ సినిమా ప్రకటించినప్పుడు ఉన్న ఆసక్తి కూడా ఇప్పుడు లేదు.

కమర్షియల్ ఎంటర్టైనర్లను రీమేక్ చేసినప్పుడు పెద్దగా ఇబ్బంది ఉండదు.. మార్పుచేర్పులు చేసుకోవడం కూడా సులువే. కానీ ఒక భాషలో క్లాసిక్ అని పేరు తెచ్చుకున్న సినిమాను రీమేక్ చేయడం మాత్రం కత్తిమీద సామే. ఈతరం ప్రేక్షకులు ఎలా ఉన్నారంటే భాషతో సంబంధం లేకుండా క్లాసిక్ సినిమాలను చూసేస్తారు. సబ్ టైటిల్స్ వేసుకుని మరీ రిపీటెడ్ గా చూస్తారు. అందుకే క్లాసిక్ సినిమాల రీమేక్స్ కు విపరీతంగా ట్రోలింగ్ జరుగుతుంది. ఒరిజినల్ సినిమాతో పోల్చి ఇది బాగాలేదని.. అది చెడగొట్టారని.. యాక్టింగ్ సరిగా లేదని.. సోల్ ను పట్టుకోలేకపోయారని.. ఫీల్ రాలేదని ఎన్నో విమర్శలు చేస్తారు. గతంలో 'ప్రేమమ్' సినిమా రీమేక్ విషయంలో అదే జరిగింది. అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ కూడా ఇలాంటి ఇబ్బందే ఎదుర్కొంది. ఈ సినిమాకు అలాంటి పరిస్థితే ఎదురయ్యే అవకాశం ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది.

అటు ప్రేక్షకులు ఇటు విమర్శకులు దాదాపుగా అందరూ తమిళ వెర్షన్ చూసి ఉన్నారు కాబట్టి పోలికలు తప్పవు. ఏమాత్రం అంచనాలు అందుకొకపోయినా విమర్శలు ఎక్కుపెడతారు. ఇక తమిళ వెర్షన్ సినిమా స్లో గా సాగుతుంది. తెలుగులో అంత స్లో ఉంటే కనెక్ట్ అవుతుందా అనేది ఒక అనుమానం. అలా అని క్రిస్ప్ గా మారిస్తే సోల్ దెబ్బతినే అవకాశం ఉంది. తమిళ వెర్షన్ లో విజయ్ సేతుపతి-త్రిష కెమిస్ట్రీ పీక్స్ లో ఉంటుంది. నిజానికి సినిమా కథ కంటే వారిద్దరి మధ్య ఉన్న ఆ కెమిస్ట్రీనే ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది. తెలుగులో శర్వా-సమంతాలు ఆ మ్యాజిక్ రిపీట్ చేయగలరా అనేది వేచి చూడాలి.

ఈ అంశాలలో ప్రేక్షకులను మెప్పించగలిగితే తప్పకుండా విజయం లభిస్తుంది. అయితే 'జాను' టీమ్ అలాంటి అవకాశం కూడా వాడుకునేలాగా కనిపించడం లేదు. ఎందుకంటే ఇప్పటి వారకూ పబ్లిసిటీ అనేది చాలా తక్కువగా ఉంది. అసలు శర్వానంద్-సమంతాల సినిమా విడుదల అవుతుంది అన్నట్టు కూడా లేదు. మరి ఇలాంటి వీక్ ప్రమోషన్స్ తో సినిమాను ప్రేక్షకులకు రీచ్ అయ్యే అవకాశం జారవిడుచుకుంటున్నారని టాక్ ఉంది. మరి జాను సంగతి ఏమౌతుందనేది త్వరలోనే తెలుస్తుంది.