Begin typing your search above and press return to search.

కరోనాపై తప్పుడు ప్రచారం...జక్కన్న ఫైర్

By:  Tupaki Desk   |   16 March 2020 12:00 PM IST
కరోనాపై తప్పుడు ప్రచారం...జక్కన్న ఫైర్
X
కరోనా పేరు చెబితే ప్రపంచ దేశాల గుండెల్లో గుబులు పుడుతోంది. విదేశాల నుంచి వచ్చిన వారి వల్ల తమ దేశంలోకి ఈ వైరస్ జొరబడకుండా ప్రభుత్వాలు పలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. ఎయిర్ పోర్టులలో ముమ్మరంగా టెస్టులు నిర్వహించడంతో పాటు కొన్ని రాష్ట్రాల్లో విద్యాసంస్థలు, థియేటర్లు, షాపింగ్ మాల్స్ లను మార్చి 31వరకు మూసివేశారు. దీంతో, ప్రజలంతా భయాందోళనలకు గురవుతున్నారు. అయితే, తగు జాగ్రత్తలు తీసుకోవడం, శుభ్రతను పాటించడం వంటి పలు చర్యల వల్ల కరోనా వ్యాప్తిని నివారించవచ్చని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే కరోనా గురించి అప్రమత్తంగా ఉండాలని, కరోనా దెబ్బకు ప్రపంచం మొత్తం స్తంభించి పోయిందని ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు భయాందోళనలకు గురి కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని జక్కన్న ట్వీట్ చేశారు.

కరోనాపై అప్రమత్తం గా ఉండాలని, పలు జాగ్రత్తలు తీసుకోవాలని...ఆ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు పలువురు సెలబ్రిటీలు, వైద్య ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. అయితే, అదే తరహాలో కొందరు సో కాల్డ్ మేధావులు...కరోనాపై ప్రజల్లో భయాందోళనలు మరింత పెరిగేలా ప్రచారం చేస్తున్నారు. ఇటువంటి ప్రచారాలను ఆపాలని, వాటి వల్ల ప్రజలు మరింత భయాందోళనలకు గురవుతారని రాజమౌళి ట్వీట్ చేశారు. కరోనాపై తప్పుడు ప్రచారం ఆపాలని జక్కన్న ఫైర్ అయ్యారు. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు పలు జాగ్రత్తలను అందరూ పాటించాలని జక్కన్న కోరారు. దీంతోపాటు కరోనా పై ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన మార్గదర్శకాలను రాజమౌళి ట్వీట్ చేశారు.