Begin typing your search above and press return to search.

ఆ హిట్ మూవీకి సెకండ్ పార్ట్ ఉందట!

By:  Tupaki Desk   |   21 May 2020 9:10 AM GMT
ఆ హిట్ మూవీకి సెకండ్ పార్ట్ ఉందట!
X
ఇండియన్ సినీ ఇండస్ట్రీ లో 'దృశ్యం' సినిమా ఎంత మంచి విజయాన్ని సాధించిందో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. 2013లో మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా మొత్తం అయిదు భాషలలో విడుదలై.. అన్నీ బాషలలో మంచి విజయాన్ని అందుకుంది. ముందుగా దృశ్యం సినిమా మలయాళ భాషలో జీతూ జోసెఫ్‌ దర్శకత్వంలో రూపొందించారు. కేరళలో ఈ సినిమా రూ .75 కోట్ల వరకు వసూల్ చేసిందట. ఆ తర్వాత తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, సింహళీ (శ్రీలంక) భాషలలో కూడా రీమేక్‌ చేయబడింది. ఇక తెలుగు దృశ్యంలో వెంకటేష్, మీనా కలిసి నటించగా బాలీవుడ్లో అజయ్ దేవగన్, శ్రీయ ప్రధాన పాత్రలకు న్యాయం చేశారు.

ఇదిలా ఉండగా ప్రస్తుతం దృశ్యం సినిమాకి సీక్వెల్ గా దృశ్యం-2 తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నారట చిత్రబృందం. దృశ్యం-2 రూపొందించనున్నట్లు స్వయంగా ఒరిజినల్ డైరెక్టర్ జీతూ జోసెఫ్‌ ప్రకటించి అందరినీ ఆశ్చర్య పరిచాడు. మొదటి భాగం దృశ్యం సినిమాలో నటించిన మోహన్ లాల్, మీనాలే రెండవ భాగంలో కూడా నటించనున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ మిగతా నటీనటులను త్వరలో ఎంపిక చేసే పనిలో ఉన్నాడట. కేరళలో సినిమా చిత్రీకరణలకు అనుమతి ఇచ్చిన వెంటనే ఈ సినిమాను పట్టాలెక్కించి ఫినిష్ చేయాలనీ డైరెక్టర్ అనుకుంటున్నట్లు సమాచారం. ఇక ఇండియన్, శ్రీలంక బాషలలోనే కాకుండా చైనీస్‌ భాషలో కూడా రీమేక్‌ అయి మంచి విజయం అందుకుంది. ఇక చైనాలోకి రీమేక్ అయిన తొలి భారతీయ సినిమాగా దృశ్యం సినిమా గుర్తింపు తెచ్చుకుంది. క్రైమ్, థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ తెరకేక్కుతుండడంతో అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయని చెప్పాలి.