Begin typing your search above and press return to search.

చార్మినార్ దగ్గర ఆ దర్శకుడి కి పనేమిటి?

By:  Tupaki Desk   |   27 Jan 2020 4:47 AM GMT
చార్మినార్ దగ్గర ఆ దర్శకుడి కి పనేమిటి?
X
చరిత్రలో చెరిగిపోని విధంగా నిలిచిపోయిన ఉదంతాల్ని సినిమాలు తీసే ధోరణి ఈ మధ్యన ఎక్కువైంది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల బయోగ్రఫీలతో పాటు.. హిస్టరీ కూడా సినిమాలకు ముడి సరుకుగా మారింది. ఈ తరహా చిత్రాలకు ఆదరణ ఎక్కువగా ఉండటంతో పాటు.. వాటిపై ఆసక్తి ఎక్కువ అవుతోంది. దీంతో.. ఈ తరహా సినిమాలు ఈ మధ్యన ఎక్కువగా వస్తున్నాయి.

మరో నెలలో ఇదే తరహాలో మరో కీలకమైన చిత్రం తెరకెక్కనుంది. కశ్మీర్ వ్యాలీలో వేలాది హిందూపండిట్లపై జరిగిన మారణహోమం.. హత్యలు.. వారిపై సాగిన క్రూరత్వం లాంటి అంశాలపై ఇప్పటివరకూ ఎవరూ సినిమగా తీయలేదు. ఆ మాటకు వస్తే.. మేధావులు.. బుద్ధజీవులు.. స్వేచ్ఛ గురించి.. మానవహక్కుల గురించి మాట్లాడే పెద్ద మనుషులు ఎవరూ కూడా ఈ అంశాన్ని ప్రస్తావించరు. ఒకవేళ ప్రస్తావించినా.. దాన్నో చిన్న అంశంగా తీసి వేస్తారే తప్పించి.. అసలు అంతటి దుర్మార్గం ఎందుకు జరిగింది? దాన్ని చేసిన వారినేం చేశారు? బాధితుల విషయంలో ఇంత దారుణమైన నిరాదరణ ఉంటుందా? లాంటి అంశాల్ని ప్రస్తావించింది లేదు.

ఇలాంటివేళ.. ఈ అంశాల్ని తీసుకొని సినిమా తీసేందుకు సిద్ధమయ్యారు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. ద కశ్మీర్ ఫైల్స్ పేరుతో ఆయన సినిమానుతీయనున్నారు. అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి నుంచి షూటింగ్ కు వెళ్లనుంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్ర దర్శకుడు తాజాగా చార్మినార్ వద్దకు వచ్చారు. అక్కడి మహాలక్ష్మి దేవాలయంలో పూజలు చేశారు. అంతేకాదు.. తాను నిర్మించబోయే సినిమాకు మద్దతు తెలుపుతున్న వారితో మీటింగ్ నిర్వహించారు కూడా.

బయట ప్రపంచానికి వెల్లడి కాని కశ్మీరీ పండిట్ల కథను దేశ యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. తానీ విషయం మీద చాలా పరిశోధన చేశానని.. అందుకే స్క్రిప్టును తయారు చేసుకునేందుకు చాలా సమయం పట్టినట్లుగా దర్శకుడు వెల్లడించారు. తానీ సినిమా తీసిన తర్వాత ఈ అంశం మీద పుస్తకం రాయాలనుకుంటున్నట్లు వెల్లడించారు. విన్నంతనే కొత్తగా అనిపించే ఈ అంశం తెర మీదకెక్కితే.. మరెన్నివాస్తవాలు వెలుగులోకి వస్తాయో?