Begin typing your search above and press return to search.

‘ఇండియన్‌ 2’ లేట్ అవడానికి లైకా వారే కారణం: డైరెక్టర్ శంకర్

By:  Tupaki Desk   |   13 May 2021 3:30 AM GMT
‘ఇండియన్‌ 2’ లేట్ అవడానికి లైకా వారే కారణం: డైరెక్టర్ శంకర్
X
విశ్వనటుడు కమల్‌ హాసన్‌ హీరోగా దర్శకుడు శంకర్‌ ప్రారంభించిన సినిమా ''ఇండియన్‌ 2''. గతేడాది చిత్రీకరణ సమయంలో ప్రమాదం జరగడం.. అప్పుడే కరోనా లాక్‌ డౌన్‌ పెట్టడం తదితర కారణాలతో ఈ సినిమా షూటింగ్‌ మధ్యలోనే ఆగిపోయింది. వివిధ కారణాల రీత్యా ఈ ప్రాజెక్టు లేట్ అవుతూ ఉండటంతో శంకర్‌ మరో రెండు ప్రాజెక్టులకు కమిట్ అయ్యారు. తెలుగులో రామ్‌ చరణ్‌ తో.. బాలీవుడ్‌ లో రణవీర్‌ సింగ్‌ తో సినిమాలు చేయనున్నట్లు ప్రకటించారు. అయితే దీనిపై 'ఇండియన్‌ 2' చిత్ర నిర్మాణ సంస్థ లైకా మద్రాస్‌ కోర్టులో శంకర్‌ పై కేసు వేసింది.

తమ సినిమా పూర్తయ్యే వరకు వేరే సినిమాలకు దర్శకత్వం వహించకుండా శంకర్ ను ఆదేశించాలని కోర్టును కోరింది. ఇప్పటికే ఈ సినిమాకు రూ.236 కోట్లు ఖర్చు చేశామని.. శంకర్ ‏కు రెమ్యూనరేషన్ గా మాట్లాడుకున్న రూ.40 కోట్లలో రూ.14 కోట్లు చెల్లించామని నిర్మాణ సంస్థ కోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణ మంగళవారం మరోమారు విచారణకు వచ్చింది. 'ఇండియన్‌-2' సినిమా లేట్ అవడానికి నిర్మాణ సంస్థ లైకానే కారణమని డైరెక్టర్ శంకర్ తరపు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. హీరో కమల్‌ హసన్ కు మేకప్‌ అలెర్జీ రావడం.. క్రేన్‌ ప్రమాదం.. కరోనా లాక్ డౌన్ కూడా అందుకు కారణాలుగా పేర్కొన్నారు.

అలానే చిత్ర నిర్మాణ సంస్థకు వచ్చిన నష్టానికి దర్శకుడు బాధ్యుడు కాడని తెలిపారు. 250 కోట్ల లోపు ఈ చిత్రాన్ని పూర్తి చేయాలని భావించామని.. కానీ నిర్మాణ సంస్థ తీవ్ర జాప్యం చేసిందని.. నిధుల కేటాయింపు, సెట్ల నిర్మాణంలో చాలా సమయం వృధా చేశారని శంకర్‌ తరపు న్యాయవాది పేర్కొన్నారు. అందువల్ల లైకా నిర్మాణ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ ను తోసిపుచ్చాలని కోర్టును కోరారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను వచ్చే నెల 4వ తేదీకి వాయిదా వేసింది.

ఇదిలావుండగా 'ఇండియన్‌-2' వివాదం ప‌రిష్కారంపై హీరో కమల్‌ హాసన్‌ దృష్టిసారిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఇరు వర్గాలతో చర్చలు జరుపుతున్న కమల్‌.. త్వరలోనే 'భారతీయుడు 2' సినిమా షూటింగ్‌ మొదలు పెట్టేందుకు సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారని సమాచారం. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ - బొమ్మరిల్లు సిద్ధార్థ్‌ - రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ - బాబీ సింహా - సముద్ర ఖని - మనోబాల వంటి భారీ తారాగణం నటిస్తున్నారు.