Begin typing your search above and press return to search.

రష్మిక బ్యాన్ పై డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు..!

By:  Tupaki Desk   |   30 Nov 2022 11:30 AM GMT
రష్మిక బ్యాన్ పై డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు..!
X
దక్షిణాది అగ్ర కథానాయిక రష్మిక మందన్నా పై కన్నడ ఇండస్ట్రీలో బ్యాన్ విధిస్తారని గత కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రష్మిక తనకు మొదటి అవకాశాన్ని ఇచ్చిన నిర్మాణ సంస్థ పేరు చెప్పకపోవడంతో కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కర్ణాటకలో పుట్టి పెరిగి.. తనని ఇండస్ట్రీకి పరిచయం చేసిన ప్రొడక్షన్ హౌజ్ పేరు చెప్పడానికి కూడా రష్మిక ఇష్టపడలేదని.. ఆమెకు కృతజ్ఞత లేదంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేసారు. అలానే కన్నడ సినిమా ఖ్యాతిని దేశ వ్యాప్తంగా చాటి చెప్పిన 'కాంతారా' సినిమాను తాను చూడలేదని చెప్పడంపైనా విమర్శలు వచ్చాయి.

రష్మిక కన్నడ సినిమాని అవమానపరుస్తుందని.. కర్ణాటక థియేటర్ యజమానులు మరియు నిర్మాణ సంస్థలు త్వరలో ఆమెపై నిషేధం విధించనున్నారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. అయితే దీనిపై తాజాగా దర్శకుడు నాగశేఖర్ స్పందిస్తూ కన్నడలో రష్మిక పై బ్యాన్ విధిస్తే.. అది ఆ చిత్ర పరిశ్రమకే నష్టమని చెప్పాడు.

నాగశేఖర్ స్వీయ దర్శక నిర్మాణంలో తెరకెక్కిన 'గుర్తుందా శీతాకాలం' సినిమా రిలీజ్ కు రెడీ అయింది. డిసెంబర్ 9న థియేటర్లలోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో రష్మిక మందన్నా వివాదంపై దర్శకుడు స్పందించారు. ఒకరి నుంచి కృతజ్ఞత కోరుకోవడం మనదే తప్పని అన్నారు.

'సంజు వెడ్స్ గీత' చిత్రాన్ని నేను తెరకెక్కించినప్పుడు అందులో కొంతమంది నటీనటులకు అవకాశం ఇచ్చాను. ఇప్పుడు వాళ్లు కెరీర్లో పెద్ద స్టార్స్ అయ్యారు. నా సినిమా తర్వాత వాళ్ళు నన్ను గుర్తు పెట్టుకుంటారా లేదా అనేది పూర్తిగా వాళ్ల వ్యక్తిగతం. నేను దాన్ని పట్టించుకోను. నా తదుపరి సినిమాపైనే ఫోకస్ పెడతాను అని నాగశేఖర్ అన్నారు.

ఎదుటివాళ్ల నుంచి కృతజ్ఞతా భావాన్ని కోరుకున్నప్పుడే మనం ఎక్కడో ఒకచోట బాధకు లోనవుతామని నాగశేఖర్ తెలిపారు. రష్మికపై కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ విధిస్తోందనే విషయం గురించి తనకు తెలియదని.. ఒకవేళ అలా చేస్తే మాత్రం అది ఆ పరిశ్రమకే నష్టమని అభిప్రాయపడ్డారు. దీన్ని తాను సపోర్ట్ చేయనని దర్శకుడు పేర్కొన్నారు.

కాగా, రష్మిక మందన్నా ప్రస్తుతం తెలుగు తమిళ చిత్రాలతో పాటుగా పలు హిందీ ప్రాజెక్ట్స్ తో బిజీగా గడుపుతోంది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం గురించి మాట్లాడుతూ.. తన డెబ్యూ మూవీ 'కిరాక్ పార్టీ' మేకర్స్ ప్రస్తావన లేకుండా మాట్లాడింది. దీనిపైనే కన్నడిగులు ఫైర్ అయ్యారు.

తన మాజీ బాయ్ ఫ్రెండ్ రక్షిత్ శెట్టికి చెందిన బ్యానర్ మరియు ఆయన సోదరుడు రిషబ్ శెట్టి డైరెక్ట్ చేసిన సినిమా కావడంతోనే రష్మిక ప్రొడక్షన్ హౌజ్ పేరు చెప్పలేదని కొందరు ఆరోపించారు. ఏ స్థాయిలో ఉన్నా మనకు ఛాన్స్ ఇచ్చినవారిని మర్చిపోకూడదని.. కృతజ్ఞత లేనివారే అలా చేస్తారని రష్మిక మీద మండిపడ్డారు.

ఇప్పటికైతే రష్మిక చేతిలో ఒక్క కన్నడ ప్రాజెక్ట్ కూడా లేదు. భవిష్యత్ లో ఆమెకు తన మాతృ భాషలో ఎలాంటి అవకాశాలు వస్తాయో చూడాలి. ఇక ప్రస్తుతం రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న 'వారసుడు' సినిమా 2023 సంక్రాంతి స్పెషల్ గా విడుదల కాబోతోంది. మరికొన్ని రోజుల్లో 'పుష్ప 2' సెట్స్ లో అడుగుపెట్టనుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.