Begin typing your search above and press return to search.

మాస్ మహారాజా మూవీ పై డైరెక్టర్ క్లారిటీ...!

By:  Tupaki Desk   |   14 Aug 2020 2:31 PM GMT
మాస్ మహారాజా మూవీ పై డైరెక్టర్ క్లారిటీ...!
X
మాస్ మహారాజా రవితేజ 'క్రాక్' అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. రవితేజ కెరీర్లో 66వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీకి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. వీరి కాంబినేషన్ లో ఇంతకముందు వచ్చిన 'డాన్‌ శీను' 'బలుపు' చిత్రాలు మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు 'క్రాక్' సినిమాతో హ్యాట్రిక్‌ హిట్ కోసం రెడీ అవుతున్నారు. రవితేజ పవర్‌ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ - వరలక్ష్మీ శరత్ కుమార్ - సముద్రఖని ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని సరస్వతి ఫిల్మ్ డివిజన్ ప్రొడక్షన్స్ లో ఠాగూర్ మధు నిర్మిస్తున్నాడు. థమన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు. మేజర్ పార్ట్ షూటింగ్ జరుపుకున్న 'క్రాక్' చిత్రాన్ని సమ్మర్ లో విడుద‌ల చేయాల‌ని భావించినప్పటికీ కరోనా కారణంగా వీలుపడలేదు. కేవలం 10 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని.. పరిస్థితులు అనుకూలించిన వెంటనే మిగతా షూటింగ్ కంప్లీట్ చేస్తామని మేకర్స్ తెలిపారు.

కాగా ఇప్పట్లో థియేటర్స్ రీ ఓపెన్ చేసేలా కనిపించకపోవడంతో చాలా సినిమాలు ఓటీటీల లో రిలీజ్ అవుతున్నాయి. ఈ క్రమంలో 'క్రాక్‌' చిత్రాన్ని కూడా ఓటీటీలోనే విడుద‌ల చేస్తారంటూ వార్త‌లు వచ్చాయి. అయితే ప్రొడ్యూసర్ ఠాగూర్ మ‌ధు అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చారు. అయితే ఇప్పుడు నాని 'వి' ఓటీటీలో విడుదల కానుందని న్యూస్ వస్తున్న నేపథ్యంలో మ‌రోసారి ''క్రాక్'' సినిమా ఓటీటీలో రిలీజ్ అవబోతోందంటూ రూమర్స్ పుట్టుకొచ్చాయి. ఈ వార్త‌ల‌పై ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేని ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. 'క్రాక్‌' సినిమా థియేట‌ర్లలోనే విడుద‌ల‌వుతుంద‌ని స్పష్టం చేసారు. దీంతో ఇప్పటి వరకు రవితేజ మూవీ పై వస్తున్న పుకార్లకు చెక్ పడినట్లయింది.