Begin typing your search above and press return to search.

బయోపిక్ ఆయన చేతుల్లో పెడుతున్నారా?

By:  Tupaki Desk   |   2 May 2018 11:56 AM GMT
బయోపిక్ ఆయన చేతుల్లో పెడుతున్నారా?
X
నందమూరి తారక రామారావు బయోపిక్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ చిత్రం నుంచి దర్శకుడు తేజ బయటికి వచ్చేశాక ఏం చేయాలో పాలుపోని అయోమయంలో పడిపోయింది చిత్ర బృందం. అసలీ సినిమా ముందుకు కదులుతుందా లేదా అనే సందేహాలు ముసురుకుంటుండగా.. బాలయ్య మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చిత్రాన్ని పూర్తి చేయాలనే పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. తేజ స్థానంలో ఎవరో ఒకరిని తీసుకొచ్చి పెట్టాలని ఆయన కొన్ని రోజులుగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించనట్లే తెలుస్తోంది. క్రిష్ విషయంలో ఆశలు పెట్టుకున్నారు కానీ.. ఆయనతోనూ వర్కవుటయ్యేలా కనిపించలేదు.

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో బాలయ్యే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తారని ప్రచారం జరిగింది. కానీ దర్శకేంద్రుడు కూడా అందుకు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. ఆయనైతే ఈ ప్రాజెక్టునే పక్కన పెట్టేయాలని సూచిస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి. అందుకే బాలయ్య ఆయన పేరును కూడా పక్కన పెట్టేసినట్లు సమాచారం. చివరగా ఇప్పుడు మరో కొత్త పేరు తెరమీదికి వచ్చింది. ‘ఆ నలుగురు’.. ‘అందరి బంధువయా’ లాంటి సినిమాలు తీసిన చంద్రసిద్దార్థ వైపు బాలయ్య బృందం చూస్తోందట. ఆయనకు దర్శకత్వ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించి.. బాలయ్యే కెప్టెన్ కుర్చీలో కూర్చుంటాడట. ప్రస్తుతం చంద్రసిద్దార్థతో సంప్రదింపులు జరుగుతున్నాయని.. ఆయన స్క్రిప్టును పరిశీలిస్తున్నారని చెబుతున్నారు. చంద్రసిద్ధార్థ ప్రస్తుతం ‘ఆటగదరా శివా’ అనే సినిమా చేస్తున్నారు. దీనికి ముందు ఆయన తీసిన ‘ఏమో గుర్రం ఎగరావచ్చు’ అట్టర్ ఫ్లాప్ అయింది.