Begin typing your search above and press return to search.

2023 సంక్రాంతి.. దిల్ రాజును ఇరికించారా?

By:  Tupaki Desk   |   13 Nov 2022 8:04 AM GMT
2023 సంక్రాంతి.. దిల్ రాజును ఇరికించారా?
X
2023 సంక్రాంతి బ‌రిలో ఓన్లీ తెలుగు రిలీజ్ ల‌కే ఆస్కారం ఉందా? డబ్బింగ్ ల‌కు నోనో అనేస్తున్నారా? అంటే అవున‌నేది తాజాగా చాంబ‌ర్ పంపిన లేఖ సారాంశం. 2023 సంక్రాంతి బ‌రిలో భారీ పందేనికి రంగం సిద్ధ‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఈసారి సంక్రాంతిపై అగ్ర హీరోలంతా క‌న్నేశారు. చిరంజీవి- బాల‌కృష్ణ‌- నాగార్జున - ప్ర‌భాస్ స‌హా ప‌లువురు హీరోల సినిమాలు విడుద‌ల కానున్నాయి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న వాల్తేరు వీర‌య్య‌.. న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ న‌టిస్తున్న `వీర సింహారెడ్డి` చిత్రాలు సంక్రాంతి పందెంలో దిగుతుండ‌డం హాట్ టాపిక్ గా మారింది. ఇద్ద‌రు అగ్ర హీరోల మ‌ధ్య పోటీ ఠ‌ఫ్ గా సాగ‌నుంద‌న్న చ‌ర్చా వేడెక్కిస్తోంది.

స‌రిగ్గా ఇలాంటి స‌మ‌యంలోనే ఇదే సంక్రాంతి రేసులో ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టిస్తున్న `వ‌రిసు` తెలుగు వెర్ష‌న్ `వార‌సుడు`ని రిలీజ్ చేయాల‌ని దిల్ రాజు భావిస్తున్నారు. ఈ త‌మిళ‌ చిత్రానికి వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌మిళం స‌హా తెలుగు-హిందీలోను ఈ సినిమాని భారీగా రిలీజ్ చేయాల‌న్న‌ది ప్లాన్. కానీ దానికి చాలా ముందే ఫిలింఛాంబ‌ర్ చెక్ పెడుతూ తాజాగా నోటిఫికేష‌న్ వెలువ‌రించ‌డం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఫిలింఛాంబ‌ర్ ప్ర‌తినిధుల నుంచి వ‌చ్చిన ప్ర‌క‌ట‌న సారాంశం ఇలా ఉంది. ఇందులో ఈసారి పండ‌గ‌ల‌కు కేవ‌లం తెలుగు చిత్రాల‌ను మాత్ర‌మే రిలీజ్ చేయాల‌ని డ‌బ్బింగుల‌కు ఛాన్స్ లేద‌ని హుకుం జారీ చేయ‌డం చర్చ‌నీయాంశ‌మైంది.

చాంబ‌ర్ పంపిన నోట్ సారాంశం ఇలా ఉంది. ``తెలుగు చలన చిత్రాల పెరిగిన నిర్మాణ వ్యయము దృష్టిలో పెట్టుకొని నిర్మాత శ్రేయస్సు కోరి తెలుగు సినిమాని కాపాడుకుందాం అనే లక్ష్యంతో తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి 08-12-2017 తేదీన న జరిగిన అత్యవసర మీటింగులో `సంక్రాంతి- దసరా` పండుగలకు స్ట్రెయిట్ తెలుగు సినిమాలకు మాత్రమే థియేటర్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.

ఈ విషయమై ప్రముఖ నిర్మాత -ఛాంబర్ ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ దిల్ రాజు 2019 సంవత్సరంలో మీడియా ద్వారా స్ట్రెయిట్ సినిమాలు ఉండగా డబ్బింగ్ సినిమాలకు థియేటర్స్ ఎలా ఇస్తాం? అని ఘాటుగా వ్యాఖ్యలు చేసి ఆ ప్రకారమే స్ట్రెయిట్ సినిమాలకు ప్రథ‌మ ప్రాధాన్యత ఇస్తూ మిగిలిన వాటిని డబ్బింగ్ సినిమాలకు కేటాయించాలని తెలియజేసారు. కాబట్టి ఈ నిర్ణయాన్ని విధిగా అమలుపర్చాలని తెలుగు చిత్ర పరిశ్రమను కాపాడుకుంటూ స్ట్రెయిట్ గా తీసిన తెలుగు చిత్రాలకు ప్రథ‌మ ప్రాధ్యానత ఇస్తూ మిగిలిన వాటిని మాత్రమే డబ్బింగ్ సినిమాలకు `సంక్రాతి- దసరా` పండుగలలో కేటాయించాలని తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి సినిమా ఎగ్జిబిటర్స్ ను (ప్రదర్శకులు) కోరుతున్నాం`` అని ప్ర‌క‌టించారు.

ఆ మేర‌కు ఫిలించాంబ‌ర్ గౌర‌వ కార్య‌ద‌ర్శులు టి.ప్ర‌స‌న్న‌కుమార్- మోహ‌న్ వ‌డ్ల ప‌ట్ల‌ ఓ ప్ర‌క‌ట‌న‌లో థియేట‌ర్ య‌జ‌మానుల‌ను కోరారు. తాజా ప్ర‌క‌ట‌న నేప‌థ్యంలో దిల్ రాజు అనువాద చిత్రం `వ‌రిసు`కి చిక్కులు త‌ప్ప‌వ‌ని గుస‌గుస వినిపిస్తోంది. ఈ స‌మస్య‌ను రాజు గారు ఎలా ప‌రిష్క‌రిస్తారో చూడాల‌ని ప‌రిశ్ర‌మ వ‌ర్గాల్లో టాక్ వినిపిస్తోంది. నిర్మాత‌ల గిల్డ్ అధ్య‌క్షుని హోదాలో దిల్ రాజు గ‌త ఏడాది చేసిన ప్ర‌క‌ట‌న ఈసారి అత‌డికే ఇబ్బందిక‌రంగా మారింద‌ని ఎర‌క్క‌పోయి ఇరుక్కుపోయాడా? అంటూ ఇప్పుడు గుస‌గుసా వేడెక్కిస్తోంది.