Begin typing your search above and press return to search.

పుష్ప బడ్జెట్‌ మరియు పారితోషికాల వివరాలు

By:  Tupaki Desk   |   9 April 2021 5:01 AM GMT
పుష్ప బడ్జెట్‌ మరియు పారితోషికాల వివరాలు
X
అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న 'పుష్ప' సినిమా పై అంచనాలు ఆకాశమే హద్దు అన్నట్లుగా ఉన్నాయి. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్‌ భారీ బడ్జెట్‌ తో నిర్మిస్తున్నారు. అల్లు అర్జున్‌ కెరీర్‌ లో భారీ బడ్జెట్‌ చిత్రంగా ఈ సినిమా నిలువబోతున్నట్లుగా చెబుతున్నారు. ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు దాదాపుగా రూ.160 కోట్ల ను ఖర్చు చేయబోతున్నారట. ఈ బడ్జెట్‌ షూటింగ్‌ పూర్తి అయ్యేప్పటికి పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. భారీ స్టార్‌ కాస్టింగ్‌ తో పాటు యాక్షన్‌ ఎపిసోడ్స్‌ కోసం హాలీవుడ్‌ టెక్నీషియన్స్‌ ను ఇంకా ప్రముఖ సాంకేతిక నిపుణులను తీసుకు వస్తున్నారట.

ఇక ఈ సినిమా కోసం అల్లు అర్జున్‌ ఏకంగా రూ.35 కోట్ల పారితోషికంను తీసుకుంటున్నాడట. దర్శకుడు సుకుమార్‌ కు రూ.25 కోట్ల పారితోషికంను నిర్మాతలు ముట్టజెప్పారు. ఇక కీలక పాత్రలో నటిస్తున్న మలయాళ స్టార్‌ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌ కు రూ.5 కోట్ల పారితోషికం కమిట్‌ అయ్యారట. వీరు కాకుండా హీరోయిన్‌ రష్మిక మందన్నాకు రూ.2 కోట్లకు పైగానే ఇస్తున్నారని.. దేవిశ్రీ ప్రసాద్‌ కూడా భారీ పారితోషికంను అందుకుంటున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. సినిమాలో నటిస్తున్న నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల పారితోషికాలే కాస్త తక్కువ రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నట్లుగా చెబుతున్నారు.

అల్లు అర్జున్‌ మరియు సుకుమార్ లు పారితోషికాలతో పాటు సినిమా సక్సెస్‌ అయితే లాభాల్లో వాటాను కూడా పొందబోతున్నారు. మైత్రి వారు పెట్టిన పెట్టుబడి వచ్చిన తర్వాత వచ్చిన లాభాల్లో హీరో దర్శకుడికి షేర్‌ ఇచ్చేందుకు వారు ఓకే చెప్పారని సమాచారం అందుతోంది. పుష్ప సినిమాకు ఉన్న బజ్ నేపథ్యంలో థియేట్రికల్‌ రైట్స్‌ మరియు ఇతర రైట్స్‌ కలిపి ఈజీగా బ్రేక్‌ ఈవెన్‌ ఖాయం అంటున్నారు. మినిమం సక్సెస్ అయినా భారీగా లాభాలు రావడం పక్కా అనే నమ్మకంతో నిర్మాణ సంస్థ ఈ రేంజ్‌ లో పెడుతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.