Begin typing your search above and press return to search.

‘దండుపాళ్యం’ దర్శకుడి మరో సంచలనం

By:  Tupaki Desk   |   6 July 2017 4:33 PM GMT
‘దండుపాళ్యం’ దర్శకుడి మరో సంచలనం
X
తెలుగువాడైన శ్రీనివాసరాజు పేరు ఐదేళ్ల కిందట కన్నడ నాట మార్మోగిపోయింది. దండుపాళ్య అనే ఊరికి చెందిన సైకో థ్రిల్లర్ బృందం చేసిన హత్యల నేపథ్యంలో వాస్తవ ఘటనల ఆధారంగా అతను రూపొందించిన ‘దండుపాళ్య’ సినిమా కన్నడలో సంచలన విజయం సాధించింది. దేశవ్యాప్తంగా ఈ చిత్రం చర్చనీయాంశంగా మారింది. ఒళ్లు గగుర్పొడిచే రీతిలో రియలిస్టిగ్గా ఈ చిత్రాన్ని రూపొందించిన తీరు ఆ తరహా సినిమాల్ని ఇష్టపడే ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఈ చిత్రం ‘దండుపాళ్యం’ పేరుతో తెలుగులోనూ విడుదలై ఇక్కడా ఆదరణ పొందింది. దీనికి కొనసాగింపుగా ‘దండుపాళ్యం-2’ కూడా తీశాడు శ్రీనివాసరాజు. త్వరలోనే ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది.

దీని తర్వాత మరో సంచలన చిత్రానికి శ్రీకారం చుట్టనున్నాడు శ్రీనివాసరాజు. కంచి పీఠం మాజీ అధిపతి ఆచార్య జయేంద్ర సరస్వతి అప్పట్లో ఓ హత్య కేసులో చిక్కుకోవడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆ కేసు వెనుక చాలా తతంగం ఉన్నట్లుగా అప్పట్లో కథనాలు వచ్చాయి. కొన్ని నెలల పాటు మీడియాలో ప్రముఖంగా ఉన్న ఈ కేసు.. ఆ తర్వాత మరుగున పడిపోయింది. ఈ కేసు వెనుక ఉన్న చీకటి కోణాల నేపథ్యంలో శ్రీనివాసరాజు ‘ఆచార్య అరెస్ట్’ అనే సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు. దీనికి ‘ఇన్సల్ట్ టు ద హిందు’ అనే క్యాప్షన్ కూడా జోడించడాన్ని బట్టి ఇది వివాదాలకు దారితీయబోతోందనే సంకేతాలిచ్చేశాడు శ్రీనివాసరాజు. ప్రకటనతోనే చర్చనీయాంశంగా మారిన ‘ఆచార్య అరెస్ట్’ విడుదల సమయానికి మరింతగా హాట్ టాపిక్ అవ్వడం ఖాయం.